రోజుకో వివాదం: బెజవాడ దుర్గగుడి ఉద్యోగుల నకిలీ పాస్ల బాగోతం
అమరావతి: దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిన దుర్గగుడి సిబ్బంది నకిలీ పాసుల కుంభకోణానికి తెరదీశారు. దుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా భక్తులు క్యూ లైన్లో నిల్చుంటుంటే అనర్హులకు దర్శనం కల్పిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది.
వాలంటీర్ల కోసం విడుదల చేసిన పాస్లు అనర్హుల చేతికి చేరడంతో ఆలయ ఉద్యోగుల ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాల్లో వీఐపీ క్యూలో రోజూ అమ్మవారిని దర్శించుకోవాలంటే గతేడాది వెయ్యి రూపాయలు ఉన్న టికెట్ ధరను ఈ ఏడాది ఐదు వేలకు పెంచేశారు.

దీంతో వాలంటీర్ల పాస్ దక్కించుకుంటే రోజూ దర్శనం చేసుకోవచ్చనే భావనతో చాలా మంది వాలంటీర్ల పాస్లు దక్కించుకుంటున్నారు. డ్యూటీ పాస్లను కలర్ జెరాక్స్గా మార్చినట్లు గుర్తించారు. ఇలా బెజవాడ ఇంద్రకీలాద్రిపై నకిలీ పాస్ల బాగోతం వెలుగు చూసింది. వందకుపైగా నకిలీ పాస్లను భద్రతా సిబ్బంది గుర్తించారు.
పాస్లను జారీ చేసే ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ నకిలీ పాస్లను పుట్టించారు. వీరిని భద్రతా సిబ్బంది గుర్తించడంతో నకిలీ పాస్ల బాగోతం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నకిలీ పాస్లు తయారుచేసిన వారు తాము దుర్గమ్మను త్వరగా దర్శించుకోవాలనే ఇలా చేశామని చెబుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications