మంత్రిపై ఫిర్యాదు- టీడీపీ నేతలపై కేసు- గుంటూరు పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్
ఏపీలో ఎన్ 440కే వైరస్ రాజకీయం మరింత ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఎన్ 440కే వైరస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో ప్రభుత్వం కేసులు పెడుతుండగా..దాదాపు ఇవే వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై మాత్రం పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు పోలీసులకు మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
గుంటూరులో తమ పార్టీ సీనియర్ నేతలు తెనాలి శ్రావణ్కుమార్, కోవెలమూడి రవీంద్ర, ఇతర నేతలపై పోలీసులు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల కంటే టీడీపీ నేతలపై కేసులు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వం విపక్షాలను అణచివేసేందుకు చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంటున్న కరోనా కట్టడిపై చూపడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై కేసులు పెట్టడం హాస్యాస్పదం, ఆక్షేపణీయమని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్కు వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలా అయితే సామాన్యులు కూడా పోలీసు స్టేషన్కు వెళ్లేందుకు భయపడతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ నేతలకు ఓ చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అనుసరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై భవిష్యత్తులో చర్యలు తప్పవన్నారు.