ఫ్యామిలీ: జగన్, చంద్రబాబు సేమ్ టు సేమ్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాజకీయాల విషయంలో, పార్టీపై పట్టు విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా లేనట్లు కనిపిస్తోంది. ఇద్దరు కూడా కుటుంబ సభ్యులను తమ పార్టీకి దూరంగా ఉంచే విషయంలో ఒకే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. పార్టీలో రెండో అధికార కేంద్రం ఏర్పడకుండా, వారసత్వ పోరు రాకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో చంద్రబాబుతో జగన్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.
ఎన్టీ రామారావు నుంచి అధికారం చేజిక్కించుకోవడానికి కుటుంబ సభ్యులందరికీ గాలం వేసి, వారికి తగిన ఆశలు పెట్టిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్కరొక్కరినే దూరం చేస్తూ వచ్చారనే అభిప్రాయం ఉంది. ఎన్టీ రామారావు హయాంలో తనకు పోటీగా నిలిచిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావునే కాకుండా నందమూరి హరికృష్ణను, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు వాడుకుని పక్కన పెట్టారు.
అదే రీతిలో వైయస్ జగన్ తాను జైలులో ఉన్నంత కాలం తల్లి వైయస్ విజయమ్మను, సోదరి షర్మిలను వాడుకున్నారని, ఇప్పుడు వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. సీమాంధ్రలో తనకు కుటుంబ సభ్యుల నుంచి పోటీ లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. షర్మిల, విజయమ్మలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించి, వారిని ఆ ప్రాంతంలోనే పోటీ చేయాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం పక్కన పెడితే ఏమైనా సీట్లు గెలుచుకోగలదా అనే అనుమానాలున్నాయి. ఈ స్థితిలో తల్లీబిడ్డలను తెలంగాణకు జగన్ తోసేస్తున్నారని అంటున్నారు. సీమాంధ్రలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో కుటుంబ సభ్యుల్లో తానొక్కడే ఉండాలనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

దగ్గుబాటి ఇలా..
ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే సమయంలో చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, కుటుంబ సభ్యులే పదవులు అనుభవిస్తున్నారనే అపవాదు వస్తుందని పక్కన పెట్టేశారు.

హరికృష్ణ చాలా కాలమే..
దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో పాటు చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చిన హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది క్లిక్ కాకపోవడంతో తిరిగి చంద్రబాబు వైపు వెళ్లారు. అయితే, కొంత కాలం హరికృష్ణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లే కనిపించి, పూర్తిగా దూరం చేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అలా..
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని వస్తూ రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్ర ఏమీ లేదు.

పురంధేశ్వరికి పచ్చజెండా..
కాంగ్రెసుకు రాజీనామా చేసిన దగ్గుబాటి పురంధేశ్వరిని టిడిపిలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించారని, అయితే దగ్గుబాటి వెంకటేశ్వర రావును మాత్రం తీసుకోబోనని ఆయన చెప్పారని సమాచారం.

షర్మిల పట్ల జగన్..
జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల పార్టీని కాపాడడానికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పాదయాత్ర కూడా చేశారు. కానీ, కడప లోకసభ స్థానం ఇవ్వడానికి జగన్ ఇష్టపడడం లేదని అంటున్నారు. పైగా, తెలంగాణలో పోటీ చేయాలని షర్మిలకు జగన్ సూచిస్తున్నట్లు సమాచారం.

వైయస్ విజయమ్మ పరిస్థితి..
పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన జగన్ తల్లి విజయమ్మను కూడా జగన్ తెలంగాణకు వెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల విజయమ్మ కూడా తన సొంత ప్రాంతానికి, సొంత రాష్ట్రానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వివేకా దూరమే..
బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి తొలుత జగన్తో విభేదించి, కాంగ్రెసులోనే కొనసాగి మంత్రి పదవి తీసుకున్నారు. ఆ తర్వాత వెనక్కి వచ్చి, పార్టీలో కీలక పాత్ర పోషించాలని అనుకున్నారు. కానీ జగన్ ఆయనను దూరంగానే పెడుతున్నారు.












Click it and Unblock the Notifications