అక్కినినే కన్నుమూత: గుండెపోటుతో అభిమాని మృతి
మెదక్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు మృతిని తట్టుకోలేని ఓ వీరాభిమాని గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. మెదక్ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మయూరీ నగర్లో నివాసం ఉంటున్న కె.రాంబాబు (55) అనే అక్కినేని వీరాభిమాని గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందాడన్న విషయాన్ని టీవీలో చూస్తూ ఉదయం 11 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు రాంబాబును స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన మామ అక్కినేనికి వీరాభిమాని అని, అక్కినేని మరణవార్త టీవీల్లో చూసి తట్టుకోలేక మరణించారని రాంబాబు అల్లుడు భాస్కర్ మీడియాతో చెప్పారు.
అక్కినేని నాగేశ్వర రావును ఓ తరం యువత విపరీతంగా అభిమానించారు. దసరా బుల్లోడు, పూలరంగడు వంటి సినిమాలు అప్పట్లో అప్పటి యువతను ఉర్రూతలూగించాయి. గుండెపోటుతో మరణించిన రాంబాబు కూడా ఆ తరానికి చెందినవారే.