కల్లోల కడలి: విశాఖ బీచ్ లో భయాందోళనలు: సందర్శకులపై నిషేధం
విశాఖపట్నం: తీరానికి చేరువ అవుతున్న కొద్దీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది ఫొని తుఫాన్. శుక్రవారం మధ్యాహ్నం ఫొని తుఫాన్ ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని దాటుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. సముద్రం క్రమంగా ఉగ్రరూపాన్ని సంతరించుకుంటోంది. కడలి కల్లోలంగా మారుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అంతకంతకూ ముందుకు చొచ్చుకుని వస్తోంది సముద్రం.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్తా: కోడ్ ఎత్తేయండి: ఫొని కదలికలపై నిఘా: చంద్రబాబు
ఈ పరిస్థితుల్లో విశాఖపట్నంలోని ప్రఖ్యాత రామకృష్ణా బీచ్ లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు జల్లులు పడుతున్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో రామకృష్ణా బీచ్ కు చేరుకున్నారు స్థానికులు. మధ్యాహ్నానికి పరిస్థితిలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అలల ఉధృతి పెరిగింది. హోరుమనే శబ్దం చేసుకుంటూ అలలు తీరానికి దూసుకు రాసాగాయి. పరిస్థితిని గమనించిన అధికారులు అప్రమత్తం అయ్యారు. సందర్శకులను ఖాళీ చేయించారు. బీచ్ ను వెంటనే ఖాళీ చేయాలంటూ మైకుల్లో ప్రకటనలు చేశారు.
ఆర్కే బీచ్, భీమిలీ, యారాడ, రుషికొండల్లో అలలు ఉధృతి తీవ్రంగా ఉంది. దీనితో ఆయా ప్రాంతాల్లో సందర్శకులను ఎవ్వరినీ అనుమతి ఇవ్వలేదు. సాయంత్రానికి బీచ్ లన్నీ బోసి పోయాయి. చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చింది. అలల ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. తుఫాన్ తీరం దాటేంత వరకూ పరిస్థితి ఇలాగే ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫొని తుఫాన్ విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు.
తుఫాన్ ప్రభావం వల్ల విశాఖ నగరంతో పాటు జిల్లాలోని భీమిలి, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం మండలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు.