చిరు మాట్లాడలేదని ఫ్యాన్స్ ఆగ్రహం, ఇంటిపై రాళ్ల దాడి
శ్రీకాకుళం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి మీద కోపం అభిమానులు స్థానిక నియోజకవర్గ అభ్యర్థి పైన చూపించారు. శుక్రవారం చిరంజీవి శ్రీకాకుళంలోని పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు గ్రామంలో ప్రసంగిస్తారని కాంగ్రెసు వర్గాలు ముందుగా చెప్పాయి.
అయితే, అక్కడకు వచ్చిన చిరంజీవి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అబ్యర్థ వంగ నాగేశ్వర రావు ఇంటి పైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చిరంజీవి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే ఆయన ప్రసంగించలేకపోయారని వంగ నాగేశ్వర రావు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మరోవైపు అభిమానులు చిరంజీవి పైన ప్రేమతో ఈ దాడికి పాల్పడ్డారని, వారి పైన తాను ఫిర్యాదు చేయదల్చుకోలేదని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి శుక్రవారం కవిటి మండలంలో నిర్వహించిన రోడ్ షో చప్పగా సాగింది. గతంలో ఇదే ప్రాంతానికి చిరంజీవి పర్యటించినపుడు, ఆనాడు హాజరైన జనంతో పోల్చుకుండే చాలా తక్కువ మంది హాజరయ్యారట. కవిటిలో మాట్లాడిన అనంతరం ఆయన నేరుగా బస్సులోకి వెళ్లడంతో ఆ తరువాత గ్రామాల ప్రజలు నిరాశ చెందారు. మండల పర్యటనంతా అర గంటలో ముగించారు.
చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన వెంట ఆపార్టీ ఎంపి అభ్యర్ధి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే అభ్యర్థులు నరేష్ కుమార్ అగర్వాలా, వంక నాగేశ్వర రావు తదితరులు ఉన్నారు.