విశాఖ లేదా అనకాపల్లి: పవన్కు విజ్ఞప్తి, మోడీకి 'ఇజం'
విశాఖ/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి లోకసభకు లేదా గాజువాక నుంచి శాసనసభకు పోటీ చెయ్యాలని విశాఖలోని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గురువారం నగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పవన్ తీసుకునే నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అందుకే ఆయన కోరకపోయినా ఆయన స్థాపించిన పార్టీలో పెద్ద ఎత్తున సభ్యులను చేర్చేందుకు సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు.
కెఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరణంరెడ్డి నరసింగ రావు మాట్లాడుతూ విశాఖలో సుమారు నాలుగు లక్షల 67 వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, వీరిని జన సేన పార్టీ సభ్యులుగా చేసేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జనసేనపార్టీ.ఆర్గ్ అనే వెబ్సైట్ ద్వారా నేరుగా సభ్యత్వం పొందవచ్చునన్నారు.

'ఇజం'తో మోడీని ఫ్లాట్ చేయనున్న పవన్
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని శుక్రవారం సాయంత్రం కలవనున్న పవన్ కళ్యాణ్... తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి, ఇరు రాష్ట్రాల సమస్యలు తదితర అంశాలపై తన ఆలోచనలను మోడీ ముందు ఉంచనున్నారని సమాచారం. ఇజం పుస్తకంలో పవన్ తన ఆలోచనలను పొందుపర్చిన విషయం తెలిసిందే.
మోడీతో భేటీ అంశాలను ఆయనను కలిశాక సాయంత్రం పవన్ వెల్లడించే అవకాశముంది. అలాకాకపోయినా ఈ నెల 27న విశాఖలో తన 'ఇజం' పుస్తకాన్ని లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీతో చర్చించిన అంశాలను పూర్తిగా వెల్లడించే అవకాశముందంటున్నారు.












Click it and Unblock the Notifications