మూడు గ్రామాలు ఖాళీ: స్థలాల కేటాయింపుపై ఫిబ్రవరి 1న ప్రకటన
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీడ్ క్యాపిటల్ గ్రామాలైన ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం, లింగాయపాలెం గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించబోతోందని సమాచారం.
రైతుల నుంచి ఆ గ్రామాల భూములను తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వారి ఇళ్లను కూడా ఖాళీ చేయించడానికి సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. ఈ నాలుగు గ్రామాల్లోని ప్రజలకు ఆయా గ్రామాలకు సమీపంలోనే ఇళ్లను కేటాయిస్తారని తెలుస్తోంది.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు ఇప్పటికే సుమారు 33,400 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన సంగతి తెలిసిందే. భూములిచ్చిన రైతులకు ఏయే ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తారన్న విషయంపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు.
దీంతో భూములిచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, వారికి ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించాలన్న అంశాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో ఓ ప్రకటన జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే వెలగపూడిలోని సర్వే నంబర్ 205, 206, 207, 208, 214లో తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాత్కాలిక సచివాలయం కోసం గురువారం టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. టెండర్ల దాఖలుకు 21 రోజులు గడువు విధిస్తున్నామని తెలిపారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. తాత్కాలిక సచివాలయాన్ని నిర్మాణాన్ని 6 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 180 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా సీడ్ క్యాపిటల్ గ్రామాలైన ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం, వెంగాయపాలెంలో రాజ్ భవన్, అసెంబ్లీ, శాశ్వత సచివాలయం నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.