ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది .. అరాచకం రాజ్యమేలుతుంది... జగన్ పై యనమల ఫైర్
ఏపీలో అరాచకం రాజ్యమేలుతుంది. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజలకు అంతా అర్ధం అవుతుంది అని జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల విరుచుకుపడ్డారు. ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని ఆయన వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై విమర్శలు చేశారు. జగన్ నెల రోజుల పాలనలో కూల్చివేతలు , దాడులు తప్ప ఇంకేం కనిపించలేదని ఆయన ఫైర్ అయ్యారు.

నెల రోజుల జగన్ పాలన అధ్వాన్నంగా ఉందన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
నెల రోజుల జగన్ పాలన అధ్వాన్నంగా ఉందన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్టాభివృద్ది, పేదల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. అభివృద్దిని దెబ్బతీసేలా, సంక్షేమాన్ని కుంటుపరిచేలా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని అందుకే ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతి దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని యనమల మండిపడ్డారు.

అన్నం ఉడికిందో లేద అంతా చూడాల్సిన పని లేదు .. దాడులు, కూల్చివేతలు తప్ప ఏం చేశారన్న యనమల
అన్నం ఎలా ఉందని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలన్నట్టు... జగన్ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంటుందో నెల రోజుల పాలనను బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, అరాచకం అన్నీ బయటపడ్డాయని ఆయన చెప్పారు. ఇక రైతుల సమస్య గాలికి వదిలేసి సమస్య పరిష్కరించలేక గత ప్రభుత్వమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితి ఉందన్న యనమల ఇంతవరకూ డ్రాట్ మిటిగెంట్ ప్లాన్పై కసరత్తే చెయ్యలేదని , ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఏం ఆదుకుంటుంది అని ఎద్దేవా చేశారు. విత్తనాలు అందక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని యనమల ప్రభుత్వానికి గుర్తు చేశారు.

రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ సర్కార్ పని చేస్తుందన్న యనమల
ఏపీ భవిష్యత్ లో తీవ్ర నష్టం జరగబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రమంతా అనిశ్చితి నెలకొందని యనమల పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లేదని, దౌర్జన్యాలు మాత్రమే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులే తమ లక్ష్యం అన్నట్టు జగన్ సర్కార్ పని చేస్తుందని ఆరోపించారు సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్న యనమల రైతులకు విత్తనాలు పంపిణీ చేయడానికి రూ.380కోట్లు కూడా ఇవ్వలేని జగన్ ప్రజలకు ఇచ్చిన వేల కోట్ల హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశం మీకు మచ్చుకైనా లేదా అని ప్రశ్నించారు.

సమాజంలో నిర్మాణాన్ని తప్ప కూల్చివేతలను ఎవరూ సమర్ధించరు అన్న మాజీ మంత్రి
ఇక టీడీపీ శ్రేణులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు సాగుతాయని ఆ సత్తా టీడీపీకి ఉందని ఆయన పేర్కొన్నారు . మా భవనాలు కూలగొడితేనో, పేదల ఇళ్లు కూల్చితేనో మీరు గొప్పవాళ్లు కాలేరని, సమాజంలో నిర్మాణమే తప్ప కూల్చివేతను ఎవరూ హర్షించరని మాజీ మంత్రి యనమల గుర్తు చేశారు. పేదల సమస్యలపై పోరాటమే ప్రతిపక్షంగా తమ విధి అన్నారు. మొత్తానికి నెలరోజుల జగన్ పాలనపై టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్వాన్నంగా ఉందని తేల్చి పారేశారు.












Click it and Unblock the Notifications