మరో కీచక తండ్రి:పదేళ్ల కూతురిపై అత్యాచారం...కేసు పెట్టిన తల్లి
ఒంగోలు:చిత్తూరు జిల్లాలో కన్న కూతురుపై కామాంధుడైన ఓ తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే...అయితే ఈ ఉదంతం మరువకముందే ప్రకాశం జిల్లాలో ఇటువంటిదే మరో ఘటన వెలుగుచూసింది.
హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న 10 ఏళ్ల కూతురు సెలవలకు ఇంటికి రాగానే భార్య ఇంట్లోలేని సమయం చూసి కుమార్తెపై అత్యాచారం చేశాడీ కీచక తండ్రి. ఈ ఘోరాన్ని బాలిక తమ్ముడు చూసి అమ్మ ఇంటికి రాగానే చెప్పగా భర్త అకృత్యంపై రగిలిపోయిన ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతటి నీచానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గపు తండ్రి మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరో తండ్రికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో మృగాడిగా మారి 10 ఏళ్ల బాలికైన తన కన్న కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదివిన 10 ఏళ్ల బాలిక వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో కామాంధుడైన తండ్రి దృష్టి ఆ బాలికపై పడింది. కన్నకూతురునే కాటేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా బుధవారం సాయంత్రం బాలిక తల్లి మేకలు కాసేందుకని అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో తండ్రి దాసరి గురవయ్య కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణాన్ని అక్కడే ఉన్న చిన్న కొడుకు చూస్తున్నా పట్టించుకోలేదు. అక్క అరుపులు, ఏడుపు అర్థం కాని ఆ బాలుడు తల్లి ఇంటికి రాగానే జరిగిన విషయం చెప్పాడు.
భర్త అరాచకంపై మండిపోయిన ఆ తల్లి తన భర్తపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకొని నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుడు గురవయ్య పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది.