తండ్రే కామాంధుడు: కూతురి నోరు మూసి అత్యాచారం!
బాధను భరించలేకపోయిన బాలిక.. విషయాన్ని అమ్మమ్మకు చెప్పంది. దీంతో స్థానికుల సహాయంతో శుక్రవారం ఉదయం రాజానగరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
రాజమహేంద్రవరం: కన్నవారి చెంతే పిల్లలకు రక్షణ లేకుండా పోతే.. అంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. తండ్రులే కామాంధులై కన్నబిడ్డలను కాటేస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు సంతోషనగర్ లోను ఇలాంటి దురాగతమే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొంతమూరుకు చెందిన ఓ వ్యక్తికి 15ఏళ్ల క్రితం కాకినాడకు చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమారుడు, 11ఏళ్ల కూతురు ఉన్నారు. కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో.. మూడేళ్ల క్రితం భార్య అతన్ని వదిలేసింది.
ఉపాధి కోసం కువైట్ బాట:
ఆపై ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆమె.. పిల్లలను తల్లి ఇంట్లో వదిలి పెట్టింది. అప్పటినుంచి అమ్మమ్మ ఇంట్లోనే చదువుకుంటున్న పిల్లలు.. ఇటీవల కొంతమూరులోని తండ్రి వద్దకు వెళ్లారు. నానమ్మ తాతయ్యలతో పాటు తండ్రిని చూడటానికి గత నెల 13వ తేదీన అక్కడికి వెళ్లారు.
ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో:
గత గురువారం రాత్రి కరెంట్ లేకపోవడంతో అంతా బయటే పడుకోగా.. చిన్నారి మాత్రం ఒంటరిగా ఇంట్లో నిద్రించింది. ఆరోజు రాత్రి 12గం.కు ఇంటికి వచ్చిన తండ్రి ఒంటరిగా నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు వినిపించకుండా నోరు మూసి దురాగతానికి పాల్పడ్డాడు.
అమ్మమ్మకు చెప్పడంతో:
బాధను భరించలేకపోయిన బాలిక.. విషయాన్ని అమ్మమ్మకు చెప్పంది. దీంతో స్థానికుల సహాయంతో శుక్రవారం ఉదయం రాజానగరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
కిరోసిన్ తాగిన తండ్రి:
కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టిన సదరు నీచపు తండ్రి.. తనపై కేసు నమోదైందని తెలియగానే శుక్రవారం ఉదయం కిరోసిన్ తాగాడు. దీంతో అతన్ని కూడా బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే చేర్పించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ రమేశ్ బాబు.. ఆసుపత్రిలో ఉన్న బాలిక వద్ద వివరాలు సేకరించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆ తండ్రిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.