బిడ్డ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్ళిన తండ్రి.. దొరవారిసత్రంలో మరో హృదయవిదారక ఘటన రిపీట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును ప్రశ్నిస్తున్న ఘటనలు నిత్యం ఏపీలో చోటుచేసుకుంటున్న తీరు రాష్ట్రంలో వైద్య సేవల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రుయా ఆసుపత్రిలో బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటన తర్వాత, వరుసగా అటువంటి ఘటనలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోవడం ఆవేదనకు గురి చేస్తుంది.
రుయా ఆసుపత్రి ఘటన తర్వాత, నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బాలుడి మృతదేహాన్ని 108 సిబ్బంది తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనను టిడిపి టార్గెట్ చేసింది. ఆసుపత్రులలో అంబులెన్సుల నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో అంబులెన్స్ ల మాఫియా రెచ్చిపోతున్నారు అంటూ మండిపడింది. ఇక తాజాగా దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సమీప చెరువులోని గ్రావెల్ కుంటలో ప్రమాదవశాత్తు రెండేళ్ల చిన్నారి అక్షయ పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
గ్రావెల్ కుంటలో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి అక్షయను బ్రతికించుకోవటం కోసం తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకువెళ్ళిన క్రమంలో అప్పటికే అక్షయ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తండ్రి మృతదేహాన్ని తరలించమని 108 సిబ్బందిని ప్రాధేయపడ్డారు. ఇక ఆసుపత్రి నుండి మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేట్ వాహనదారులు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.
దీంతో వారు అడిగిన డబ్బులు చెల్లించలేక పోయిన సదరు తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని సొంత గ్రామానికి బైక్ మీద తీసుకువెళ్ళాడు. ఆస్పత్రి నుంచి గ్రామానికి సుమారు 18 కిలోమీటర్ల దూరం ఉన్నా, కూతురు డెడ్ బాడీని భుజాన వేసుకొని తండ్రి ఊరికి తీసుకువెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇక ఈ ఘటనపై ప్రశ్నించగా తండ్రి తన అసహాయ పరిస్థితికి కన్నీటిపర్యంతమయ్యారు.