విశాఖపట్నంలో ఉద్రిక్తత.. తన్నుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు..
విశాఖపట్నంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. 26వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు జరిగిన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదనే విషయమై ఇరువర్గాల మధ్య రగడకు దారితీసింది. విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి, వైసీపీ నార్త్ ఇన్ ఛార్జి కేకే రాజు, వార్డు కార్పొరేటర్ శ్రావణి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఇందులో పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం శంకుస్థాపన ఎందుకు జరగడంలేదని టీడీపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు.
దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగే వరకు వెళ్లింది. టీడీపీకి చెందిన గ్రేటర్ విశాఖ ఫ్లోర్ లీడర్ పేల శ్రీనుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శ్రీను కింద పడిపోగా ఆయన చేతికి పెట్టుకున్న రూ.4 లక్షల విలువైన వాచ్ పూర్తిగా పగిలిపోయింది. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

పోలీసులు పక్ష పాతంగా వ్యవహరించారని, ఇతర వార్డుల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇక్కడకు తీసుకొచ్చారని, తమపై గొడవకు దిగారని శ్రీను ఆరోపించారు. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వైసీపీ నాయకులకు పోలీసులు సహకరించారని, టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు రోప్ వేశారన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని చెప్పారు. విశాఖపట్నం నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాలను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.
విశాఖ దక్షిణం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నగర పరిధిలోని నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ కొన్నాళ్లుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే 26వ వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకొని గొడవకు దారితీసింది.












Click it and Unblock the Notifications