విశాఖ ఉక్కు కోసం సినీ వర్గాల మద్దతు .. చాలా పెద్ద అన్యాయం అన్న మంచు మనోజ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. అటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటిస్తే, మరోపక్క టాలీవుడ్ ప్రముఖులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ గళాన్ని విప్పుతున్నారు.
విశాఖ ఉక్కు కోసం ప్రధాని మోడీకి లేఖ రాసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బాధ పడుతున్నాం అన్న మంచు మనోజ్
మొన్నటికిమొన్న చిరంజీవి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ప్రకటన చేస్తే తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడిన మంచు మనోజ్ ఇది చాలా పెద్ద అన్యాయమని పేర్కొన్నారు. తాము హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము అని ఆయన పేర్కొన్నారు.
లాభాల్లో ఎందుకు నడిపించ లేకపోతుందో చెప్పాలంటూ ప్రభుత్వానికి మంచు మనోజ్ ప్రశ్న
స్టీల్ ప్లాంట్ ను కొనడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దాన్ని లాభాల్లో ఎందుకు నడిపించ లేకపోతుందో చెప్పాలంటూ ప్రశ్నించారు మంచు మనోజ్. ఈ విషయంలో ప్రభుత్వం తన విధానాన్ని ఎందుకు మార్చుకోకూడదని ప్రశ్నించిన మనోజ్ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న ఉక్కు ఉద్యమం .. స్టీల్ ప్లాంట్ లో ఈనెల 25వ తేదీ నుండి సమ్మె సైరన్
ధర్నాలు, ఆందోళనలతో కార్మికులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మరో వైపు ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ సాగిస్తున్న పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళతామని కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు నిబంధనల ప్రకారం 14 రోజుల గడువు నోటీసును ఇచ్చిన కార్మికులు నోటీస్ లో పలు డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు.