ముద్రగడ కాపు సభకు ఏర్పాట్లు: వంగవీటి రంగా, రాధాలపై సినిమా
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తునిలో జనవరి 31వ తేదీన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాపు రిజర్వేషన్ల పోరాట సంఘాలన్నీ ఏకతాటి మీదికి వచ్చి ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాదులో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి.
రిజర్వేషన్లపై అవగాన ఉన్న మేధావులు, ప్రముఖులతో సంఘాల నాయకులు చర్చలు జరుపుతున్నారు. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, అవి ఎందుకు పోయాయో వివరిస్తూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, న్యాయకోవిదులు, మాజీ ఐఎఎస్లతో తమ సభ్యులకు కాపు సంఘాలు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాయి.

తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ఆరేటి ప్రకాష్ ఆదివారం ఓ ప్రకటనలో అననారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.
ఇదిలావుంటే, కాపు నాయకులు వంగవీటి రాధా, వంగవీటి రంగాలను వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కుట్రలు, కుతంత్రాలతో ఎలా మట్టుబెట్టారు, ఆ ఇద్దరినీ ఎలా పావులుగా వాడుకున్నారు, పని అయ్యాక పథకం ప్రకారం ఎలా అంతం చేశారనే కథాంశంతో ఓ సినిమా నిర్మాణానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆ సినిమాకు ఈ నెల 31వ తేదీన తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు మహాగర్జన సభలో క్లాప్ కొట్టడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications