AP Legislative Council: మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్న..! తీవ్ర విమర్శలు..!
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు ఇవాళ ప్రారంభమైన ఏపీ శాసనమండలి (AP Legislative Council) సమావేశాల్ని కుదిపేశాయి. డీఎస్సీ అక్రమాలపై చర్చ కోరుతూ వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. అనంతరం దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వారి ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఘాటుగా బదులిచ్చారు. దీంతో మండలిలో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి నిరుద్యోగులను మోసం చేసింది బొత్స సత్యనారాయణ కాదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఐదేళ్లు యువత జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నీతులు చెబుతారా అని ఆయన్ను నిలదీశారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 300 కోర్టు కేసులు వేసిన చరిత్ర వైసీపీదే అన్నారు. దమ్ముంటే చర్చకు రండి.. ప్రతి అంశానికి ఆధారాలతో సమాధానం చెబుతాం అని సవాల్ విసిరారు. వైకాపా ఐదేళ్ల నిర్వాకంపై బుక్లెట్ పంపిస్తాం, చదువుకుని సభకు రావాలని సూచించారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్న బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అనే పదం వాడటం వివాదాస్పదమైంది. దీనిపై వైసీపీ సభ్యులు భగ్గుమన్నారు.

అచ్చెన్నాయుడు తనను ఉద్దేశించి దద్దమ్మ అని వ్యాఖ్యానించడంపై విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ మండిపడ్డారు. మనిషి పెరిగితే బుద్ధి రాదని, ఎద్దులా ఇంత ఎత్తు ఎదిగితే తెలివితేటలు రావన్నారు. మాట బాగుండాలంటూ బొత్స వ్యాఖ్యానించారు. ఎవరు ఆంబోతులా ఉన్నారో, ఎవరు పరిపాలన చేస్తున్నారో, రైతులు ఎరువులు లేకుండా చస్తుంటే పట్టించుకోవడం లేదో ఈ దద్దమ్మ తెలుసుకోవాలన్నారు. కాబట్టి ఈ భాష శాసనమండలిలో మంచిది కాదన్నారు. మంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని బొత్స కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు తాను ఎప్పుడూ అన్ పార్లమెంటరీ భాష మాట్లాడనని చెప్పుకొచ్చారు.














Click it and Unblock the Notifications