పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు, తప్పించుకున్న మావోల కోసం వేట ; ఏఓబీలో అలజడి
ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు పోలీసుల ముందు లొంగిపోవడం, మరి కొందరు కీలక నేతలను అరెస్టు చేయడంతో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఇక ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
తులసిపాడు అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
ఈ క్రమంలో తాజాగా ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారని సమాచారం. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు అందిన సమాచారంతోనే డి వి ఎఫ్, ఎస్ ఓ జి బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయని సమాచారం.
ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈసారి ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైన మావోయిస్టు పార్టీ నేతలు ఎక్కడికక్కడ కరపత్రాలను వేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభం కావడంతో ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టు నేతలు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఆదివాసీలను సమీకరించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.
మావోల కోసం దండకారణ్యం జల్లెడ పడుతున్న పోలీసులు
ఆదివాసీలలోకి మావోయిస్టు పార్టీ ఉద్యమ తీవ్రతను తీసుకువెళ్ళేలా పక్కా ప్లాన్స్ రూపొందించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన పోలీసులు దండకారణ్యం జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్ట్ సానుభూతిపరులపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు. అంతేకాదు ఇప్పటికే అరెస్ట్ చేసిన మావోయిస్ట్ ల నుండి కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు.
అరెస్ట్ లు, లొంగుబాట్లు, మరణాలతో మావోయిస్ట్ పార్టీకి ఇటీవల తీరని నష్టం
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన అగ్రనేతలు కొందరు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. మరి కొందరు అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయారు. ఇంకొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేత హరి భూషణ్ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతే, అనారోగ్య కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న హరి భూషణ్ భార్య శారద ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితో పాటు ఇద్దరు కమాండర్లు, మరో ముగ్గురు మావోయిస్టు నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ ముందు లొంగిపోయారు. ఇటీవల ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమ లను హత్య చేసిన కీలక మావోయిస్టు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.