పశ్చిమలో తొలి బర్డ్ ఫ్లూ కేసు-రెడ్ జోన్ ఏర్పాటు, పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు..!
ఏపీలోని గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వైరస్ తో కోళ్లు వేల సంఖ్యలో చనిపోతున్నట్లు ఇన్నాళ్లూ భావించారు. కానీ ఇవాళ తొలి బర్డ్ ప్లూ కేసు బయటపడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో మాంసం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరులో బర్డ్ ఫ్లూ కేసు బయటపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. అక్కడ పీపీఈ కిట్లతో సిబ్బంది కోళ్లకు వైరస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన కోళ్లను దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తున్నారు. తద్వారా మిగతా కోళ్లకు ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు హేచరీల్లో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో కోళ్ల అమ్మకాలు సైతం నిలిచిపోయాయి. ఇప్పుడు అధికారులు మాసం దుకాణాల్ని సైతం మూసేయాలని ఆదేశాలు ఇస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్ల మృత్యువాత , బర్డ్ ప్లూ కేసు బయటపడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి సంబంధించి తాజా పరిస్ధితిని అంచనా వేయనున్నారు. ఆ తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన చెప్తున్నారు.
ఇప్పటికే కోళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపారు. రెండు రోజుల్లో వీటి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ లోపు కోళ్ల ఫారాలను మూసేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో కోళ్ల రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే చికెన్ వినియోగదారులు సైతం ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications