టీడీపీ అభ్యర్ధుల లిస్టులో తొలి మార్పు ? ఆ సీనియర్ నేతకు చంద్రబాబు పిలుపు..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు ఏకమైన టీడీపీ, జనసేన ఉమ్మడిగా అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో 94 సీట్లలో టీడీపీ అభ్యర్ధుల్ని ప్రకటించగా.. జనసేన పోటీ చేస్తున్న 24 సీట్లలో ఐదు సీట్లలో అభ్యర్ధులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగతా సీట్లపై పవన్, చంద్రబాబు మరోసారి ప్రకటన చేయబోతున్నారు. అయితే ఇలా చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లలో ఓ మార్పు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ అభ్యర్ధుల తొలి జాబితాలో కర్నూలు జిల్లా డోన్ స్ధానానికి అభ్యర్ధిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే జిల్లాలో కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు సీట్లను కోట్ల కుటుంబం కోరుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై నిలబెట్టేందుకు సిద్దమవుతున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి కంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని నిలబెడితే డోన్ లో పోరు ఆసక్తికరంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు చంద్రబాబు నుంచి తనను వచ్చి కలవాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కోట్ల కుటుంబ వారసుడు ఇప్పుడు చంద్రబాబును కలిసి డోన్ సీటు ఖరారు చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోట్ల కుటుంబం కోరుతున్న ఆలూరు సీటును వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం కోసం టీడీపీ రిజర్వు చేసినట్లు తెలుస్తోంది.
రేపు ఆయన టీడీపీలో చేరబోతున్నారు. ఆ తర్వాత జయరాం సిట్టింగ్ సీటు అయిన ఆలూరును తిరిగి ఆయనకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే కర్నూలు ఎంపీ సీటులో వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన ఎంపీ సంజయ్ కుమార్ కోసం రిజర్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications