ఏపీలో కరోనా: విశాఖలో భారీ షాక్.. జగన్ ‘ఆరెంజ్’ యత్నాలకు బ్రేక్.. ‘వీసీ’లతో చంద్రబాబు వాయింపు..
లాక్ డౌన్ ముగిసిన వెంటనే రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న ఉద్దేశంతోనే అక్కడ కరోనా కేసుల్ని తొక్కిపెడుతున్నారంటూ ప్రతిపక్షం విమర్శలు.. గడిచిన 14 రోజుల్లో అక్కడ ఒక్కో కేసు కూడా నమోదు కానందున దాన్ని రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు మార్చేందుకు ప్రభుత్వం యత్నాలు.. గంటల వ్యవధిలోనే ఈ రెండు అంశాల విషయంలో అటు టీడీపీకి, ఇటు వైసీపీకి భారీ షాక్ తగిలింది. విశాఖలో కేసులపై కేంద్రం క్లారిటీతో టీడీపీకి చెక్ పడగా.. గడిచిన 24 గంటల్లో ఒక కేసు నమోదు కావడం సర్కారుకు అడ్డంకిగా మారింది.
Recommended Video

ఆ ఒక్కదాంతో..
మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై తీవ్రస్థాయి రాజకీయ దుమారం కొనసాగుతున్నది. వైరస్ నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం దారుణంగా ఫెయిలైందంటూ టీడీపీ, బీజేపీ, జనసేన వరుస విమర్శలు సంధిస్తున్నాయి. కేసుల నమోదు నుంచి టెస్టింగ్ కిట్ల కొనుగోళ్ల వరకు.. ప్రతి చోటా లోపాలు, కుట్రలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే విశాఖలో వైరస్ ను నియంత్రించడంలో ఏపీ సర్కారు బాగా పనిచేసిందని, ఇవే తరహా చర్యలు తీసుకుంటే మిగతా జిల్లాల్లోనూ మంచి ఫలితాలొస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శనివారం నాటి ప్రెస్ మీట్ లో ఏపీని అభినందించారు. దీంతో ప్రతిపక్ష నేతల నోళ్లకు తాళం పడినట్లయింది. కానీ ఆదివారం వెలుగుచూసిన ఒకే ఒక్క కేసుతో సీన్ మళ్లీ మారింది..

జగన్ ప్రయత్నాలకు గండి..
లాక్ డౌన్ పొడగింపు అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 15న కేంద్రం... కరోనా రెడ్ జోన్ జిల్లాల్ని ప్రకటించడం, ఏపీలో ఏకంగా 11 జిల్లాలూ రెడ్ పరిధిలో ఉండటం తెలిసిందే. కాగా, శనివారం నాటికి విశాఖలో(గడిచిన 14 రోజులుగా) ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం 14 రోజులపాటు కొత్త కేసులు రాకుంటే ఆ ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా మార్చుకునే వీలుంది.
28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకానిపక్షంలో గ్రీన్ జోన్లోకి మార్చుకోవచ్చు. ఆ మేరకు విశాఖను ఆరెంజ్ జోన్లోకి మార్చే అంశంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే రాజధాని తరలింపు వేగవంతమయ్యేలా ఈ చర్య తోడ్పడుతుందని సీఎం భావించారు. కానీ ఆదివారం ఆదివారం నాటి హెల్త్ బులిటెన్ లో విశాఖలో కొత్త కేసు నమోదు కావడంతో ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడ్డట్లయింది. అంతేకాదు, విశాఖలో కేసుల విషయంలో ప్రభుత్వం దాపరికం పాటించడం లేదనీ వెల్లడైనట్లయింది.

ఇదీ సీన్..
ఆదివారం మధ్యాహ్నం ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 647కు పెరిగింది. అందులో 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 565. గడిచిన 24 గంటల్లో 44 కొత్త కేసులురాగా, అందులో విశాఖపట్నం జిల్లా నుంచి ఒక కేసు ఉండటం గమనార్హం. తాజా కేసుతో కలిపి, ఆ జిల్లాలో మొత్తం 21 కేసులు నమోదుకాగా, అందులో 16 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5 యాక్టివ్ కేసులున్నాయి.

చంద్రబాబు చెల్లని రూపాయి..
విశాఖలో కరోనా కేసులు దాచిపెడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి మండిపడ్డారు. ప్రభుత్వ నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి ప్రబలలేదని కేంద్రం కూడా గడ్డిపెట్టినా బాబు ఏడుపు ఆగదని, ఆయన బుద్ధి కూడా మారబోదని అన్నారు. నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తోన్న పచ్చ మీడియాను చూసి జనం ఛీకొడుతున్నారని, జీవితమంతా మ్యానిపులేషన్లతోనే కాలం గడిపిన చంద్రబాబు.. చెల్లని రూపాయితో సమానమని విమర్శించారు. మీడియాలో కనిపించకపోతే బాబు బతకలేడని, అందుకే రోజూ వీడియో కాన్ఫరెన్స్(వీసీ)ల పేరుతో వాయిస్తున్నాడని, ఆయనేం చెబుతున్నాడో సొంత పార్టీ నేతలకే అర్థం కాక, సోదిని భరిస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు.

రాజీనామాకు రెడీ..
విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల్ని ప్రభుత్వం దాచిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సైతం వెనుకాడబోనని మంత్రి అవంతి శ్రీనివాస్ చాలెంజ్ చేశారు. ఆదివారం విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. విశాఖలో కేసులు దాస్తున్న విషయాన్ని ఒకవేళ నిరూపించలేకపోతే టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని మంత్రి సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications