ఉద్యోగులా ? పేదలా ? - మా ప్రాధాన్యమిదే- జగన్ సర్కార్ డేంజర్ గేమ్- ఏపీలో తొలిసారి పోలిక
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి పేదలు ఎంత ఉపయోగపడ్డారో ఉద్యోగులు కూడా అంతే. ఇరువురి మద్దతుతోనే వైసీపీ భారీ మెజారిటీతో అధికారం అందుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ హామీలు నెరవేర్చమని కోరుతుంటే పేదలే తమ ప్రాధాన్యమంటోంది. ఉద్యోగులు ఆగలేరా అని ప్రశ్నిస్తోంది. చివరికి ఉద్యోగులు వర్సెస్ పేదల పోరుకు తెరదీస్తోంది. ఉద్యోగులు గట్టిగా అడిగితే పేదలతో వారిని టార్గెట్ చేసేందుకు జగన్ సర్కార్ డేంజర్ గేమ్ కు రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
జగన్ హామీల పరంపర
వైసీపీని 2019లో ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ జగన్ భారీ స్ధాయిలో హామీలు ఇచ్చారు. ఇందులో పేదలతో పాటు ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలిచ్చారు. ఇలా ఇచ్చిన హామీల్ని నమ్మి ఇరువురూ తమ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. కులమతాలకు అతీతంగా పేదలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓట్లేయడంతోనే వైసీపీ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ, ఓట్ల శాతంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హామీల విషయంలో మాత్రం వైసీపీ సర్కార్ వీరి మధ్య వ్యత్యాసం చూపుతోంది.
ఉద్యోగులకు నెరవేరని హామీలు
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి పీఆర్సీ, సీపీఎస్ విధానం రద్దు.. మిగతా హామీలు కూడా ఎలాగో ఉన్నాయి. అయితే కీలకమైన పీఆర్సీ అమలు, సీపీఎస్ విధానం రద్దుపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కార్యదర్శుల కమిటీలు, అధికారుల కమిటీల పేరుతో కాలయాపన చేసేస్తున్నారు. చివరికి ఉద్యోగులు ప్రతీ నెలా ఠంజనుగా జీతం సకాలంలో అందితే చాలనే పరిస్ధితి వచ్చేసింది. పెననర్ల సంగతి ఇక చెప్పాల్సిన పనేలేదు. వీరికి డీఏ బకాయిలు కూడా ఇప్పటికీ అందని పరిస్ధితి. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని గమనించిన ఉద్యోగ సంఘాలు మొదట్లో ప్రభుత్వానికి మద్దతిచ్చినట్లు కనిపించినా ఇప్పుడు మాత్రం గళం విప్పుతున్నారు.
పేదల సంక్షేమానికే సర్కార్ ప్రధాన్యం
ఓవైపు ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించలేక, వారికి ఇచ్చిన పీఆర్సీ, సీపీఎస్ హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది.అయినా గతంలో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. సంక్షేమ అజెండాలో ఎక్కడా తేడా రాకుండా నవరత్నాల శాఖ ద్వారా ప్రతీ పథకం అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అయినా పూర్తిగా పేదల్లో అసంతృప్తి లేకుండా చూడటం కష్టంగానే ఉంది అయినా ఎక్కడా సంక్షేమం ఆగకూడదన్న సీఎం జగన్ ఆదేశాల్ని ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
ఉద్యోగులు, పేదలకు పోలిక
ఓవైపు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే రెండున్నరేళ్లు కాలయాపన చేసేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు వారు గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి మాట్లాడుతోంది. పేదలకు సంక్షేమం అమలు చేయకుండా ఉద్యోగులు అడ్డుపడుతున్నారన్న వాదనను తెరపైకి తెస్తోంది. వాస్తవానికి ఉద్యోగులు అడుగుతోంది వారికి ఇచ్చిన హామీల అమలు మాత్రమే. కానీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాధాన్యం పేదల సంక్షేమమే అంటోంది. రాష్ట్రంలో 90 శాతం పూటగడవని పేదలున్నారని, వారే తమ ప్రాధాన్యమని ఆర్ధికమంత్రి బుగ్గన పదే పదే చెప్తున్నారు. వీరి సంక్షేమాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించలేమని పరోక్షంగా చెప్పేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఇది మరో చిచ్చుకు కారణమవుతోంది.
రాష్ట్రంలో తొలిసారి
రాష్ట్రంలో ఇప్పటివరకూ పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా పేదలకు సంక్షేమ పథకాల అమలును ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపెట్టిన దాఖలాలు లేవు. ఉద్యోగులు తమ డిమాండ్లు అడిగితే పేదలకు ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ తర్వాతేననే మాట ఏ ప్రభుత్వం నుంచీ వినిపించలేదు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం తొలిసారి పేదలకూ, ఉద్యోగులకూ పోలిక పెడుతోంది. ఉద్యోగులు గొంతెత్తితే వారిని పేదలతో లింక్ చేసి వారిపైకి ఉసిగొల్పేందుకు సిద్దమవుతోంది. తద్వారా తాము పూటగడవక ఇబ్బందులు పడుతుంటే మీకు జీతాలు పెంచాలా అనే డిమాండ్ ను పేదల నుంచే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఉద్యోగులు వర్సెస్ పేదల పోరు అనే డేంజర్ గేమ్ ను జగన్ సర్కార్ తెరపైకి తెస్తున్నట్లు అర్ధమవుతోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇవ్వొద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, కానీ వారితో లింక్ చేసి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.