టీ నోట్కు కౌంటర్: రిజైన్లకు ఎంపీలు, మంత్రులు రెడీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన డ్రాఫ్ కేబినెట్ నోట్ అందిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అప్రమత్తమయ్యారు. షిండే ప్రకటనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు గురువారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై దాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి వారు వెంటనే స్పీకర్ మీరా కుమార్ అపాయింట్మెంట్ కోరారు.
తమ రాజీనామాలను ఆమోదించాలని పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎస్పీవై రెడ్డి, హర్ష కుమార్ స్పీకర్ను కోరారు. అయితే, స్పీకర్ వారికి ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమయం ఇచ్చారు. తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు వేసినా తాము స్పీకర్ కార్యాలయంలో బైఠాయించి, రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ వాదనలను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా, సమస్య పరిష్కారం కాకుండా తెలంగాణపై ఏ విధంగా ముందుకు వెళ్తారని లగడపాటి ప్రశ్నించారు. సమైక్యాంధ్రను తప్ప యుటి సహా దేన్నీ అంగీకరించబోమని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వేర్పాటువాదుల మాదిరిగా ఎవరిపై విద్వేషాలు పెంచడం లేదని, ఉద్యమం ప్రశాంతంగా జరుగుతోందని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ వేశారు కాబట్టి తాము తమ రాజీనామాలపై ఇప్పటి వరకు ఒత్తిడి తేలేదని ఆయన చెప్పారు. తమకు తెలియకుండా తెరచాటు వ్యవహారాలు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ నిర్ణయంపై ముందుకు అడుగు వేయకుండా యాభై రోజులు ఆపామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో విజయం సాధిస్తామని విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ తయారు కావద్దని, అడుగు ముందుకు వేయకూడదని ఆయన అన్నారు. నోట్ తయారు చేయాలనుకుంటే అసెంబ్లీ తీర్మానం తర్వాతే చేయాలని ఆయన అన్నారు. తాము చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నామని, సమైక్యాంధ్రను కాపాడుకుంటామని ఆన అన్నారు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత తమపై ఉందని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనని ఆయన అన్నారు.
కాగా, విభజనపై అడుగు ముందుకేస్తే పదవులను వీడుతామని కేంద్ర మంత్రులు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ లేఖపై ఇప్పటికే సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి సంతకాలు చేశారు. తాను రాజీనామా చేయబోనని పనబాక లక్ష్మి గురువారం ఆంధ్రప్రదేశ్లో చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామాకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications