వైసీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్సీలు : వీరి వైపే జగన్ మొగ్గు : త్వరలో..మరో ఇద్దరికీ ఛాన్స్..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ..ఇప్పుడు శాసనమండలిలోనూ బలం పెంచుకోనుంది. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ నుండి ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్ర బోస్..టీడీసీ నుండి లోకేశ్ మాత్రమే ఓడిపోయారు. వీరిద్దరూ యధా విధిగా ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు. అయితే, ఇప్పుడు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల్లో మూడు స్థానాలు ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. మిగిలిన రెండు స్థానాల్లోనూ ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

మండలిలో వైసీపీ బలం ఇలా..
ఏపీ శాసన మండలిలో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా..మరో నాలుగు త్వరలో ఖాళీ కానున్నాయి. టీడీపీ నుండి వైసీపీ చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఆయన తో పాటుగా ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన వారిలో టీడీపీ నుండి పయ్యావుల కేశవ్, కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికల్లో గెలుపొందారు. అదే విధంగా..వైసీపీ నుండి ఆళ్ల నాని, కోలగట్ల వీరభ్రద స్వామి మండలి సభ్యులుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. దీంతో..టీడీపీ నుండి ఇద్దరు..వైసీపీ నుండి ఇద్దరు మండలిలో తమ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నారు. ఈ అయిదు ఖాళీల్లో మూడు ఎమ్మెల్యేల కోటా..మరో రెండు స్థానిక సంస్థల కోటాలో ఎంపిక కావాల్సి ఉంది.

వారి పదవీ కాలం వరకే కొత్త వారికి...
ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి ఎంపికై ఇప్పుడు ఎన్నికైన కరణం బలరాం, ఆళ్ల నాని పదవీ కాలం 2022 మార్చి 29తోనూ, కోలగట్ల వీరభద్ర స్వామి పదవీ కాలం 2021 మార్చి 29తో ముగియనుంది. వీరు ముగ్గురు రాజీనామా చేసిన తరువాత వీరి స్థానంలో ఎంపికయ్యే కొత్త వారు వీరి పదవీ కాలం వరకే సభ్యులుగా ఉంటారు. ఇక, స్థానిక సంస్థల కోటా లో ఇద్దరికీ 2021 వరకు అవకాశం ఉంది. అయితే, ఈ ఎన్నికల పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక, స్థానిక సంస్థల కోటాక సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఎన్నిక నిర్వహిస్తారా లేక తరువాత నిర్వహి స్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు శాసనసభ్యుల కోటాలో జరిగే మూడు స్థానాల ఎన్నికల్లోనూ వైసీపీ సభ్యులే ఏక గ్రీవంగా దక్కించుకోనున్నారు. సభలో మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో అవి వైసీపీకే దక్కనున్నాయి.

ఆ మూడు స్థానాలు వీరికేనా..
ఇక, ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. దీంతో..ఇప్పుడు ఆ సీట్లు దక్కించుకునే ముగ్గురు ఎవరనేది చర్చ మొదలైంది. జగన్ తన ఎన్నికల ప్రచార సమయంలో కొంత మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మంత్రి పదవుల గురించి హామీ ఇచ్చారు. అందులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. దీంతో. ఆయనకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఇక, తొలి నుండి వైయస్ను..తరువాత జగన్ను నమ్ముకొని ఉండి.. జగన్తో పాటుగా జైలు జీవితం గడిపిన మాజీ మంత్రి మోపిదేవి తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు మత్సకారుల కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో..ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, విజయవాడలో ముస్లిం మైనార్టీ అభ్యర్దికి సీటు ఇవ్వలేకపోయామని..విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ వ్యక్తికే తొలి ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో అవకాశం ఇస్తానని ప్రకటించారు. దీంతో..ఈ ముగ్గురికీ ఎమ్మెల్సీ లుగా ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కనుండి. ఇక, ప్రకాశం..కర్నూలు..అనంతపురం జిల్లాలో హామీలు ఇచ్చిన వారికి స్థానిక సంస్థల కోటాలో అవకాశం ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications