బాలికను చంపి చెరువులో పడేశాడు: మేనమామ పనే
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుచానూరులో పట్టపగలే లక్ష్మిప్రియ (5) అనే బాలిక సోమవారం అపహరణకు గురైన కొన్ని గంటల్లోనే దారుణంగా హత్యకు గురైంది. హంతకుడు స్వయాన మేనమామే. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న ఆస్తితగాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తిరుచానూరులోని ఈతమాకుల వీధికి చెందిన మల్లీశ్వరి, పెంచల్రెడ్డి దంపతులకు లక్ష్మిప్రియ ఏకైక కుమార్తె.
పెంచల్రెడ్డి చెన్నైలోని ఓ హోటల్ క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. లక్ష్మిప్రియ తిరుచానూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యుకెజి చదువుతోంది. రోజూ ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గంటల పాంత్రంలో ఆటోలో ఇంటికి చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం ఇంటికి కొంతదూరంలో ఆటో దిగిన లక్ష్మిప్రియను ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వెంట తీసుకువెళ్లినట్లు స్థానికులు చూశారు.
లక్ష్మీప్రియ సకాలంలో ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లితండ్రులు పాఠశాలకు, ఆ తరువాత ఆటో డ్రైవర్ను సంప్రదించారు. తాను ఇంటికి సమీపంలో రోడ్డుపైన వదిలి వెళ్ళాలనని అతను చెప్పడంతో తల్లిదండ్రులు సమీపంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడంతో తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా తన అన్నతో ఆస్తి తగాదాలున్నాయని ఈనేపధ్యంలో వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని మల్లీశ్వరి అనుమానం వ్యక్తం చేసింది.
పోలీసులు వెంటనే ఐదు టీంలను రంగంలోకి దింపి ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే మల్లీశ్వరి అన్న శ్రీనివాసులు రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించడంతో రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని వికృతమాల చెరువులో లక్ష్మిప్రియను చంపి పడేసినట్టు పడేసినట్లు తెలిపాడు. దీంతో తిరుచానూరు పోలీసులు రేణిగుంట పోలీసుల సహాయంతో రాత్రి వేళ చెరువులోని లక్ష్మిప్రియ మృతదేహాన్ని తీవ్రంగా గాలిస్తున్నారు.