సీఎం జగన్ కీలక నిర్ణయం: కరోనాతో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్
అమరావతి: కరోనావైరస్ మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్లో అనేక మంది ప్రాణాలు తీస్తోంది. ఎన్నో కుటుంబాల్లో తీరని షోకాన్ని నింపుతోంది. అయితే, మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మృతి చెందినవారి పిల్లలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్పై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలను తీర్చాలని సీఎం జగన్ అధికారులు సూచించారు. కరోనా మృతుల పిల్లలకు సాయంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయంపై ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ సింఘాల్ తెలిపారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ. 10 లక్షలు డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా పిల్లలకు అందజేయనున్నామని తెలిపారు. వారికి 25 ఏళ్లు వచ్చే వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ డబ్బును వారు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఇందుకోసం జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.
మరోవైపు, బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందించనున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిపై త్వరలోనే జీవో ఇస్తామన్నారు. బ్లాక్ ఫంగస్ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిది మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితుల గురించి ప్రైవేటు ఆస్పత్రులు సమాచారం ఇవ్వాలని కోరారు. దీని చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామన్నారు.