బస్సులో మంటలు: పరుగులు తీసిన ప్రయాణికులు
అనంతపురం: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో భయంతో ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెర్లోపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
తాడిపత్రి డిపోకు చెందిన బస్సు తాడిపత్రి వైపు వెళుతుండగా బస్సు లోపలి వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయగా స్థానికులు మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.
బస్సు నుంచి పడి యువతికి తీవ్రగాయాలు
తిరుమల కొండపై ఆర్టీసీ బస్సులోంచి కింద పడటంతో హారిక అనే యువతికి తీవ్రమైన గాయాలయ్యాయి. మొదటి ఘాట్రోడ్డు 21వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సులో కొండపైకి వెళుతున్న సమయంలో బస్సు ఎమర్జెన్సీ డోర్ నుంచి హారిక కిందపడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు, చేతులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తిరుమల ఆస్పత్రికి తరలించారు. హారికను అనంతపురం వాసిగా గుర్తించారు.
రాజమండ్రిలో ఈదురుగాలులు
రాజమండ్రిలో సోమవారం సాయంత్రం భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వేగంగా వీచాయి. దీంతో పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. టెంట్ల కింద ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.