వాయుగుండం ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక..!!
బంళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. రెండు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కాగా, మంగళవారం తిరుపతి జిల్లా మల్లంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూలతోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో 52 తీర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వాకాడులో సముద్రం దాదాపు 30 మీటర్లు ముందుకు వచ్చింది. దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం బుధవారం పుదుచ్చేరి-మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications