పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత, ఉద్రిక్తం: భీమవరంలో 144వ సెక్షన్
భీమవరం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో, పోలీసులు భీమవరంలో గురువారం 144వ సెక్షన్ విధించారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గురువారం ఉదయం పవన్ ఫ్లెక్సీలు చించి వేసి ఉన్నాయి. వాటిని ఎవరో ధ్వంసం చేశారు.
అయితే, మరో హీరో వర్గం వారు ఈ పనికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు ర్యాలీ తీశారు. ఇరువర్గాల మధ్య కులం అంశమే ఘర్షణకు దారి తీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు 144వ సెక్షన్ విధించారు.

కాగా, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉదయం.. అభిమానులు ఆందోళనకు దిగారు. అనుమానితుల ఇళ్లపై దాడులు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఒక హీరో అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు మరో హీరో అభిమానులు ధ్వంసం చేయడమేమిటనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, హీరో ప్రభాస్ అభిమానులే వాటిని చించేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, వారు ప్రభాస్ ఫ్లెక్సీలను చించేసి వాటిని రోడ్డు మీద పడేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications