అన్న క్యాంటీన్ లో ఆహార కొరత...నిరాశతో వెనుదిరిగిన జనం
విజయవాడ:ప్రభుత్వం సదాశయంతో ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్లు నిర్వాహకుల అలక్ష్యం కారణంగా విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు భారీగా ఖర్చు పెడుతున్నా కొన్ని చోట్ల నిర్వహణా వైఫల్యం జనాలకు నిరాశకు గురిచేస్తోంది.
తాజాగా విజయవాడ గాంధీనగర్ లోని అన్నా క్యాంటిన్ కు వచ్చిన జనాలు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ అన్న క్యాంటీన్ లో భోజనం చేసేందుకని వచ్చిన ప్రజలు ఆహారం ఐపోయిందనే మాట విని నిరాశగా వెనుదిరిగారు. పైగా గురువారం అన్న క్యాంటీన్లో 400 గ్రాములు పెట్టవలసిన భోజనాన్ని 200 గ్రాముల చొప్పున పెట్టారని కస్టమర్లు వాపోయారు.
ఇలా చాలీచాలని ఆహారంతో ఇబ్బందికి గురయ్యామని కొందరు వినియోగదారులు చెప్పగా...మరికొందరికి లైన్లో చాలాసేపు నిలుచున్నప్పటికి అసలు ఆహారమే లభించక వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు.
అన్న క్యాంటీన్లకు సంబంధించి 50వేల జనాభా పైబడిన అన్ని పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం తొలి విడతగా 100 క్యాంటీన్లను ఆరంభించింది. ఈ 203 క్యాంటీన్ల ఏర్పాటుకు బడ్జెట్లో రూ. 200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క క్యాంటిన్ ఏర్పాటుకు రూ.36 లక్షలను మంజూరు చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి మొత్తం రూ.15లు ఒక్కరి నుంచి వసూలు చేస్తారు.
మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నంతోపాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి వడ్డించాలి. మధ్మాహ్నం, రాత్రి భోజనంలో అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, సాంబారు 120 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందించాలి. ఈ క్యాంటీన్లు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు, అందే విధంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది.
మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అన్నక్యాంటీన్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకోవడం ఈ పరిస్థితికి దారి తీసినట్లు చెబుతున్నారు. భోజనం కోసం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది వారిని నిలువరించలేకపోయినట్లు సమాచారం. దీంతో కమిషనర్ కస్టమర్లపై అసహనం వ్యక్తం చేయగా, మున్సిపల్ కమిషనర్ తీరును జనం తప్పుబట్టారు. ఈ క్రమంలో తోపులాట ఉద్రిక్తతకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.