రాజధాని అమరావతి కోసం ....తెనాలిలో చంద్రబాబు భారీ బహిరంగ సభ
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తెనాలిలో దీక్షా శిబిరం వద్ద వైసీపీ , టీడీపీ , అమరావతి జేఏసీ నేతల ఘర్షణలో గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి బుధవారం (29 తేదీ జనవరి) తెనాలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

తెనాలిలో రేపు భారీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
ఒక పక్క ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ధ్యేయంగా రాష్ట్రంలో మండలిని సైతం రద్దు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే రాజధాని ప్రాంత రైతుల పోరాటం మాత్రం ఆగటం లేదు . మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తెనాలిలో గత 27 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెనాలిలో రేపు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

వైసీపీ నేతల దాడిని నిరసిస్తూ రేపు మధ్యాహ్నం జేఏసీ నాయకులకు చంద్రబాబు పరామర్శ
అమరావతి సంఘీభావ జేఏసీ కన్వీనర్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు ఈ విషయాన్ని తెలిపారు. రాజధాని అమరావతి కోసం నిర్వహిస్తున్న దీక్షల వల్ల ప్రజల్లో సానుకూల ధోరణి పెరుగుతుందని పేర్కొన్న ఆయన కావాలనే కుట్ర పూరితంగా వైసీపీ నేతలు శిబిరంపై దాడిచేశారని ఆరోపించారు. కావాలనే పోలీసుల సాయంతో తొలగించారని దీక్షా శిబిరాలను తొలగించారని మండిపడ్డారు.
ఇక ఈ క్రమంలో వైసీపీ నేతల దాడిని నిరసిస్తూ రేపు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు జేఏసీ నాయకులను పరామర్శిస్తారని పేర్కొన్నారు.

మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ
అనంతరం మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని శేషగిరిరావు పేర్కొన్నారు . ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరావతికి సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.ఇటీవల తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజధాని అమరావతికి మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే . తెనాలిలో అమరావతి కోసం నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Recommended Video

ఇటీవల దీక్షా శిబిరంపై కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడి
కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.అంతేకాదు శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు.శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేశారు. వైసీపీ నేతల తీరుపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీసి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. ఇక ఈ నేపధ్యంలోనే దీక్షలు చేస్తున్న వారికి మనోస్థైర్యాన్ని ఇవ్వటానికి చంద్రబాబు తెనాలికి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications