సీఈవో అధికారాలు సీయస్ వద్ద తాకట్టు: కౌంటింగ్కు 21వేల మంది : కేంద్రాల్లో వీవీ ప్యాట్ల లెక్కింపు..
టిడిపి నేతలు సీయస్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. సీఈవో అధికారాలను సీయస్ వద్ద తాకట్టు పెట్టారని టిడిపి నేతలు ఆరోపించారు. ఇక, కౌటింగ్ ఏర్పాట్ల పైన ద్వివేదీ స్పందించారు. లెక్కింపు ప్రక్రియ కోసం 21వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు అయిదేసి కేంద్రాల్లో వీవీ ప్యాట్లను లెక్కించాలని నిర్ణయించారు.

సీఈవో అధికారాలు సీయస్ వద్ద..
టిడిపి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పైన విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తన రాజకీయ జీవితంలో ఇంత అహంకారపూరితమైన అధికారని చూడలేదంటూ మండి పడ్డారు. ఎన్నికల కౌంటింగ్ పైన సమీక్ష నిర్వహించిన సీయస్..సీఈవోను తన వద్దకు పిలిపించి సమీక్ష చేయటాన్ని తప్పు బట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. తాజాగా ఎల్వీ సుబ్రమణ్యం చేసిన సమీక్షల పైన మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు తీవ్ర ఆరోపణలు చేసారు. దొడ్డి దారిన సీయస్ అయిన వ్యక్తి ఎల్వీ అంటూ టిడిపి నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎల్వీ హద్దులు దాటుఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.

కౌంటింగ్కు 21వేల మంది సిబ్బంది..
ఇక, ఎన్నికల కౌంటింగ్ పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి సారించారు. దీని పైన ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు..ఎస్పీలతో సమీక్ష చేసిన ఆయన తాజాగా కౌంటింగ్ సెంటర్ల గురించి సమీక్ష జరిపారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 21వేల మంది వరకూ సిబ్బంది అవసరమని చెప్పారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరూ ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు. రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ను నియమిస్తున్నామని చెప్పారు.

అయిదేసి కేంద్రాల్లో వీవీ ప్యాట్ల లెక్కింపు..
ఇప్పటికే ఏపిలో అయిదు కేంద్రాల్లో రీపోలింగ్ కోసం సిఫార్సు చేసామని..అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాతే రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఒకే పేరుపై రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదని, అలా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్కు గంట ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఫీల్డ్ అసిస్టెంట్ను బెదిరించినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ జరపాలని నెల్లూరు కలెక్టర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. అసెంబ్లీ, లోక్సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు
జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ద్వివేది వివరించారు.












Click it and Unblock the Notifications