ఏపీ మాజీ సీఎం సతీమణి కన్నుమూత -కాసు రాఘవమ్మ మృతిపై సీఎం జగన్ సంతాపం
తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన కాసు కుటుంబంలో విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతోన్న రాఘవమ్మ ఆదివారం ఉదయం హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో కన్నుమూశారు.
చనిపోయేనాటికి రాఘవమ్మ వయసు 97 సంవత్సరాలు. రాఘవమ్మ మరణంతో కాసు కుటుంబంలో విషాదం అలముకుంది. వారి స్వస్థలం గుంటూరు జిల్లా చిరుమామిళ్ల (నాదెండ్ల మండలం). రాఘవమ్మ భర్త, మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి 1994లో కన్నుమూయడం తెలిసిందే.

మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మ మరణం పట్ల ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కాసు కుటుంబ రాజకీయ వారసుడు, రాఘవమ్మ మనవడైన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ కు సీఎం జగన్ ఫోన్ చేసినట్లు సమాచారం.

కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడిగా కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్సార్ కు సన్నిహితుడైన కృష్ణారెడ్డి అప్పట్లో ఎంపీగానూ వ్యవహరించారు. కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్ ప్రస్తుతం గురజాల శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మహేశ్ వైసీపీలో చేరారు.












Click it and Unblock the Notifications