కొత్త ఎస్ఈసీ కోసం అన్వేషణ: నిమ్మగడ్డ స్థానంలో నీలం సాహ్నీకి ఛాన్స్?: రేసులో జస్టిస్ కనగరాజ్
అమరావతి: కొత్త ఎన్నికల కమిషనర్ కోసం జగన్ సర్కార్ అప్పుడే అన్వేషణ మొదలు పెట్టిందా?, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి అవసరమైన సన్నాహాలు చేపట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొత్త ఎస్ఈసీగా నియమించడానికి ఇప్పటికే కొందరు పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

కొత్త ఎస్ఈసీ నియామకం తరువాతే
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియడానికి ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2016లో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులు అయ్యారు. మార్చి 31వ తేదీన ఆయన అయిదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ లోగా ఆయన స్థానంలో మరో అధికారిని నియమించడానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తరువాతే.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు పలుమార్లు స్పష్టం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సమర్థవంతంగా, అంతకుమించి నిష్పక్షపాతంగా నిర్వహించే వారికే అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ వాదనగా చెబుతున్నారు. ఆ బాధ్యతలను నీలం సాహ్నీకి అప్పగిస్తే.. ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నీలం సాహ్నీకి ఛాన్స్?
ఈ పరిణామాల మధ్య నీలం సాహ్నీ పేరు వినిపిస్తోంది. ఆమెను తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడానికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానిక- ప్రభుత్వ సలహాదారుగా నీలం సాహ్నీని నియమించాలని తొలుత జగన్ సర్కార్ భావించింది. దీనికోసం ఉత్తర్వులు కూడా సిద్ధం చేసినప్పటికీ.. ఎన్నికల కమిషనర్గా పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రికి సానుకూల అభిప్రాయమే
నీలం సాహ్నీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూల అభిప్రాయమే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించుకున్నారాయన. గత ఏడాది జూన్ 30వ తేదీ నాడే నీలం సాహ్నీ పదవీ కాలం ముగిసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉండటం, వివిధ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో కొత్త వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే.. కొంత గందరగోళం ఏర్పడవచ్చనే అభిప్రాయంతో ఆమె పదవీ కాలాన్ని మూడు నెలలోసారి చొప్పున.. రెండుసార్లు పొడిగించేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు వైఎస్ జగన్.

సలహాదారుగా నియామకానికీ..
కిందటి నెల 31వ తేదీన నీలం సాహ్నీ పదవీ విరమణ చేశారు. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలను స్వీకరించారు. తన పదవీ కాలంలో సమర్థవంగా విధులను నిర్వర్తించిన అధికారిగా ముఖ్యమంత్రి వద్ద మార్కులు పొందిన నీలం సాహ్నీ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని భావించారు. ఆమెను సలహాదారుగా నియమించాలనుకున్నప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తే మేలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు.

జస్టిస్ కనగరాజ్కు న్యాయం చేస్తారా?
ఎన్నికలను నిర్వహించి తీరాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖల విషయంలో నీలం సాహ్నీ సమర్థవంతంగా వ్యవహరించగలిగారని, ప్రభుత్వ అభిప్రాయాన్ని, వాదనను గట్టిగా వినిపించగలిగారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవంక- నిమ్మగడ్డ పునర్నియామకంతో ఎస్ఈసీ పదవి నుంచి అర్ధాంతంగా వైదొలగిన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్కు న్యాయం చేయాలనే భావన కూడా ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తరువాత.. మళ్లీ ఆయనకే అవకాశం ఇవ్వాలనే వాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications