నాదెండ్లకు జనసేనలో కీలక బాధ్యతలు, కష్టకాలంలో అండగా ఉండి ఇప్పుడు షాక్
తిరుపతి: మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహారాల్లో తెరవెనక నుంచి పాల్గొంటున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి, సాయంత్రం జనసేనానితో మళ్లీ కలిసి తెరముందుకు వచ్చారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో తెలిపారు.
పవన్తో కలిసి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి విజయవాడ నుంచి తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని పవన్, నాదెండ్ల మనోహర్ కలసి శుక్రవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్నవారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం శుక్రవారం విజయవాడకు వస్తారు. జనసేనలో చేరికను ప్రకటించే అవకాశముంది.

మళ్లీ తెనాలి నుంచే పోటీ
పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో జరిగే కార్యక్రమంలో లాంఛనంగా జనసేనలో చేరుతారు. గతంలో రెండు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత స్పీకర్గా వ్యవహరించారు. రానున్న ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచే జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

పవన్ కీలక బాధ్యతలు, పార్టీ ఆఫీస్ కేంద్రంగా
పార్టీలో ఉన్నత స్థాయి కమిటీలోకి ఈయనను తీసుకోవచ్చునని అంటున్నారు. పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటనలు, ప్రచారంలో నిమగ్నమైతే రాష్ట్రంలోని పార్టీ కార్యాలయం కేంద్రంగా నాదెండ్ల మనోహర్ పని చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. విజయవాడలో శనివారం జనసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభమవుతుంది.

కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, రాహుల్ గాంధీకి దగ్గరై
2019పై కాంగ్రెస్ మళ్లీ ఆశలు పెట్టుకుంటున్న సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీని వీడటంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టిన సమయంలోను ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, తిరిగి పుంజుకుంటున్న సమయంలో వెళ్తుండటంపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడినా రాహుల్ గాంధీ గుంటూరు ఆంధ్రా ముస్లిం కళాశాలలో నిర్వహించిన సభలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. మంచి వక్తగా పేరుంది. ఈ కారణంగా కూడా రాహుల్ గాంధీకి దగ్గరయ్యారు.

కర్ణాటక ఎన్నికల వ్యూహకర్తగా, ఆ పదవిపై ఆశలు
ఏపీ నుంచి రాహుల్ గాంధీ బృందంలో ఉన్న అతికొద్ది మంది నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. తెలుగు, ఇంగ్లీష్లలో మంచి పట్టు ఉంది. రాహుల్ గాంధీ ఈయనను కర్ణాటక ఎన్నికల వ్యూహకర్తగా పంపించారు. ఎన్నికలు ముగిసేవరకు ఆయన అక్కడే ఉన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాల్సిన అంశాలపై మేనిఫేస్టోను రూపకల్పన చేసే బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగింది. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారట.

కాంగ్రెస్కు మింగుడు పడని అంశాలు
తన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేకపోవడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ మనసు మార్చుకున్నారని భావిస్తున్నారు. జిల్లాలో 2014 ఎన్నికల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు మరో కీలక నేత వీడటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు.












Click it and Unblock the Notifications