జేపీ బాటలో జేడీ ? ఎన్నికల సంస్కరణలపై ట్వీట్లు-త్వరలో సుప్రీంకోర్టులో పిల్ !
ఏపీలో ఎన్నికల సంస్కరణల గురించి ఎప్పుడు చర్చ జరిగినా అందులో లోక్ సత్తా ఉద్యమం గుర్తుకొస్తుంటుంది. ఎన్నికల సంస్కరణల కోసం గతంలో లోక్ సత్తా పలు ప్రతిపాదనలు చేయడం,వాటిని జనంలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం, ఆ తర్వాత ప్రభుత్వాలను వాటిపై ఒప్పించడం వంటి ప్రయత్నాలు చేసేది. అప్పట్లో ఈ ఉద్యమంతోనే జయప్రకాష్ నారాయణ్ మేథావిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

జయప్రకాష్ నారాయణ-లక్ష్మీనారాయణ
ఏపీలో ఒకప్పుడు డాక్టర్ గా, బ్యూరోక్రాట్ గా సత్తా చాటుకుున్న జయప్రకాష్ నారాయణ అనంతర కాలంలో లోక్ సత్తా ఉద్యమంతో తెరపైకి వచ్చారు. ఎన్నికల సంస్కరణలపై అలుపెరగని పోరాటంచేశారు. ఓ దశలో యూపీఏ హయాంలో సోనియగాంధీతో పాటు జాతీయ సలహా మండలిలో సైతం పనిచేశారు. లోక్ సత్తాను రాజకీయ పార్టీగా మార్చి అసలైన రాజకీయం చేయాలని ప్రయత్నించినా అప్పటికే జనం అలవాటుపడిన రాజకీయాన్ని వదిలి ఆయనకు మద్దతివ్వలేదు. దీంతో జేపీ తెరమరుగయ్యారు. మరోవైపు వైఎస్ జగన్ సీబీఐ కేసులతో తెరపైకి వచ్చిన అనంతపురం వాసి వీవీ లక్ష్మీనారాయణ అనంతరం వీఆర్ఎస్ తీసుకుని ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. వ్యవసాయం చేస్తూ కొంతకాలం, రైతులతో కలిసి కొంతకాలం పయనించిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మరో ప్రయత్నం మొదలుపెట్టారు.
ఎన్నికల సంస్కరణల కోసం పోరు
దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం గతంలో జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ఉద్యమం నిర్మించారు. ఓవైపు ఎన్నికల సంస్కరణల్ని సూచిస్తూనే మరోవైపు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆహ్వనం మేరకు జాతీయ సలహా మండలిలో చేరి నోటావంటి సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం,సమాచార హక్కు చట్టం వంటి వాటిని అమల్లోకి తెచ్చే విషయంలో జేపీ ఆలోచనలు ఉన్నాయి. ఎన్నికల సంస్కరణల కోసం ఏడీఆర్ వంటి సంస్ధలతో కలిసి జేపీ చేసిన కృషి అప్పట్లో పలువురి ప్రశంసలు అందుకుంది.
లక్ష్మీనారాయణ సూచిస్తున్న సంస్కరణలు
ఎన్నికల సంస్కరణల కోసం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ట్విట్టర్ లో పలు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో ఓ ఎంపీ, ఎమ్మెల్యే తన పదవీకాలం పూర్తయ్యేలోపు పదవికి రాజీనామా చేస్తే, ఎన్నికల్లో తదుపరి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని మిగిలిన కాలానికి ప్రజా ప్రతినిధిగా ప్రకటించాలని ఆయన కోరారు. సంస్కరణ -2లో ప్రధానమంత్రి, సిఎంలు, మంత్రులు పాలనా బాధ్యతలు వహిస్తారు,కాబట్టి వారు పార్లమెంటుకు లేదా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి అనుమతించకూడదన్నారు. కార్యనిర్వాహక పదవులు లేదా పార్టీ పదవులు నిర్వహించాలా అనేది వారు నిర్ణయించుకోవాలన్నారు. సంస్కరణ -3లో ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిష్పక్షపాతంగా చేయడానికి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన కమిటీ ఈసీలను ఎంపిక చేయాలన్నారు. పదవీ విరమణ తర్వాత, లాభదాయకమైన పదవుల్లో ఉద్యోగం చేయడం కోసం వారు శాశ్వతంగా నిషేధించబడాలన్నారు. సంస్కరణ-4లో ఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా అదే రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని నియమిస్తారని, తటస్థత, నిష్పాక్షికతను కాపాడటానికి, సీఈవో ఆ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్ర కేడర్ నుండి నియమించబడాలన్నారు. సంస్కరణ -5లో రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావాలని కోరారు. సంస్కరణ -6లో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లో పేర్కొన్న నేరాలకు సంబంధించి కోర్టు ద్వారా క్రిమినల్ అభియోగాలు మోపబడిన వారిని విచారణలో కేసు పరిష్కారమయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలన్నారు.

సుప్రీంకోర్టులో పిల్ కు ఏర్పాట్లు
ఈ మేరకు లక్ష్మీనారాయణ తాను ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంస్కరణల్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వీటి అమలుకు న్యాయపోరాటం చేయాలని కూడా నిర్ణయించారు. తాను ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంస్కరణలను అమలు చేసేలా న్యాయపోరాటం చేసేందుకు త్వరలో సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. తద్వారా మౌలిక విషయాలపై సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించాలని మాజీ జేడీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications