ఏపీ, తెలంగాణాపై భారత్ పాక్ యుద్ధప్రభావం? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే!
ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ లోని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాల పైన దాడులు చేసి వాటిని సమూలంగా నాశనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ భారత్ పైన ప్రతి దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతుంది.
తెలుగు రాష్ట్రాలను పాక్ టార్గెట్ చేస్తుందా?
భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ తెలుగు రాష్ట్రాలపై ఏమైనా ప్రభావం పడుతుందా? ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్న ఆందోళన ప్రజలలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రెండు టార్గెట్ అవుతాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే గనక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల పైన యుద్ధం ప్రభావం ఉంటుందని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.

క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఈ విషయం పైన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు హాని కలగాలంటే పాక్ యుద్ధ విమానాలు మన గగన తలంలోకి ప్రవేశించాలని, అయితే అది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. మన సరిహద్దు రక్షణ వ్యవస్థ అత్యంత బలం గా ఉందని ఆయన వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాలను పసిగట్టి వాటిని మన గగనతలం లోకి రాకుండానే పేల్చి వేసే వ్యవస్థ భారతదేశానికి ఉందన్నారు.
సరుకులు నిల్వ చేసుకోవాలనే వార్తలపై ఆయన ఏమన్నారంటే
తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల దాకా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.ఇక చాలామంది యుద్ధం వస్తుంది, సరుకులు నిల్వ చేసుకోవాలని చెబుతున్నారని, అయితే అంత అవసరం లేదని ఆయన సూచించారు. ఇది కేవలం మార్కెట్ పెంచుకోవడానికి జరిగే కుట్ర మాత్రమేనని ఆయన వెల్లడించారు.
యుద్ధం జరిగినా ఏపీ, తెలంగాణాలో ఇలాగే ఉంటుంది
కొన్ని మీడియా సంస్థలలోనూ, సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ చానల్స్ లోను వచ్చే వార్తలను నమ్మవద్దని, యుద్ధ సమయంలో ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగినా తెలుగు రాష్ట్రాలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications