అమరావతి రైతుల యాత్రలో జేడీ లక్ష్మీనారాయణ- పాలన మారితే పాలసీ మారుస్తారా: రాజధానుల బిల్లు పైనా..!!
ఏపీకి అమరాతి ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా ఇప్పటికే పలు పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తాజాగా.. సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులు వారి ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శలు చేయటం సరి కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు..రాష్ట్ర ప్రయోజనాల కోసమే వారు పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతుందన్నారు. రాజధాని ఒకే చోట పెట్టుబడులు వస్తాయని..పెట్టుబడులు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వాలు మారినా..పాలసీల్లో మార్పులు సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు.
అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా, బాలాయపల్లి మండలం, వెంకటరెడ్డిపల్లిలోని.. వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
నెల్లూరు జిల్లాలో "న్యాయస్థానం నుండి దేవస్థానం మహా పాదయాత్ర"లో పాల్గొని ప్రభుత్వాలు వాగ్దానం చేసిన విధంగా అత్యాధునిక రాజధాని అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ పథకంలో భూములు ఇచ్చిన రైతులతో కలిసి సుమారు 7.5 కిలోమీటర్లు నడిచా ను. pic.twitter.com/EvQ8zF1dIs
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) December 5, 2021
కందలి, నాయుడుపాళెం, తిరువెంగళాయపల్లి, కొమ్మునేటూరు, చెనుర్తి, తిరుపతిగారిపల్లి వద్ద ప్రజలు వారికి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామంటూ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హైకోర్టు మూడు రాజధానుల బిల్లుల కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో కేసులు ఒక వైపు ... మూడు బిల్లులు సిద్దం అవుతాయంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో అమరావతి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.