వైఎస్ జగన్ డైలాగ్ ను కాపీ కొట్టిన చంద్రబాబు: దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడంటూ కౌంటర్!
అమరావతి: దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము అధికారంలో వచ్చాం. చంద్రబాబు నాయుడు మా నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కోట్ల రూపాయల ప్రలోభ పెట్టి కొన్నాడు. అందుకే- దేవుడు.. ఆయన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిపించేలా స్క్రిప్ట్ రాశాడు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో చెబుతూ వచ్చిన డైలాగ్. జాతీయ స్థాయిలో మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే కాదు.. అసెంబ్లీలోనూ ఈ మాటను ఆయన ప్రస్తావించారు.
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు. pic.twitter.com/aU7CV1tWZz
— N Chandrababu Naidu (@ncbn) August 15, 2019
తాజాగా- ఇదే డైలాగ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు. దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని అంటూ..వైఎస్ జగన్ డైలాగ్ ను తానూ ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుదీకరించింది. విద్యుదీకరించిన ఈ ఫొటోలను ఆధారంగా చేసుకుని.. చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై కౌంటర్ అటాక్ చేశారు. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్ గా, భ్రమరావతిగా అబద్ధాలు చెబుతూ వచ్చారో.. వారి ద్వారానే అమరావతిలోని భవనాలను విద్యుదీకరించారని ఎద్దేవా చేశారు. మరింత అందంగా చూపించేలా చేశాడు అని ఎదురు దాడికి దిగారు.

తాత్కాలిక భవనాలు చంద్రబాబు నిర్మించినవే
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనం చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయంలో నిర్మితమైన విషయం తెలిసిందే. దీనితోపాటు శాసనసభ, హైకోర్టు భవనాలు కూడా ఆయన ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. అవన్నీ తాత్కాలికమైనవే. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వమే ప్రకటించింది. వాటిని తాజాగా ప్రభుత్వం విద్యుద్దీపాలతో అలంకరించడంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడానికి చంద్రబాబుకు అవకాశం చిక్కనట్టయింది.













Click it and Unblock the Notifications