చంద్రబాబుకు కరోనా పాజిటివ్: క్వారంటైన్లో..: నారా కుటుంబంలో కోవిడ్ కలకలం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ కోవిడ్ బారిన పడ్డారు. ఐసొలేషన్లో ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్సలను తీసుకుంటున్నారు. నారా లోకేష్కు కరోనా వైరస్ సోకడం.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవరపాటుకు గురి చేసింది.
చంద్రబాబు కూడా..
ఆ మరుసటి రోజే- చంద్రబాబు నాయుడు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందని చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం బాగుందని, కోవిడ్ లక్షణాలు స్వల్పంగా మాత్రమే కనిపించాయని చెప్పారు.
క్వారంటైన్లో
ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉంటున్నానని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నానని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. త్వరలోనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి వస్తానని హామీ ఇచ్చారు. పార్టీ క్యాడర్లో భరోసా నింపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల నుంచీ చంద్రబాబు ఇంట్లో ఎక్కువ సమయం గడిపిన విషయం తెలిసిందే.
రెండేళ్లల్లో అధిక సమయం ఇంటి వద్దే
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన గడిపారు. ఆ సమయంలో పరిమితంగా మాత్రమే ఏపీకి వచ్చారు. హత్యారోపణలతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. ఆ తరువాత క్రమంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్న కొద్దీ- ఏపీ రాజకీయాల్లో చురుగ్గా కనిపించారు. గత ఏడాది కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సమయంలో జూమ్ వీడియో కాల్స్ ద్వారా తరచూ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.
కుప్పంలో విస్తృత పర్యటన..
ఇటీవలే చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ప్రతి మండలంలోనూ కలియ తిరిగారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. తొలుత నారా లోకేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. జ్వరం, దగ్గుతో బాధపడిన నారా లోకేష్కు కోవిడ్ నిర్దారణ పరీక్షలను చేయగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయన ఐసొలేషన్లో ఉంటున్నారు.
కుటుంబ సభ్యులకు టెస్టింగ్స్..?
ఆ మరుసటి రోజే చంద్రబాబు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. స్వల్పంగా మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్సలను చేయించుకోవాలని సూచించారు. దీనితో చంద్రబాబు కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించినట్లు తెలుస్తోంది. భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణికి కరోనా వైరస్ టెస్టింగులను జరిపించారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
కొనసాగుతున్నతీవ్రత..
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 4,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల మరణాలేవీ సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,182గా నమోదయ్యాయి. 14,510 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు-1,004, విశాఖపట్నం-1,018 కేసులు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలవారీగా..
అనంతపురం-162, తూర్పు గోదావరి-263, గుంటూరు-345, కడప-295, కృష్ణా-170, కర్నూలు-85, నెల్లూరు-261, ప్రకాశం-176, శ్రీకాకుళం-114, విజయనగరం-169, పశ్చిమ గోదావరి-46 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను విధించనుంది. ఈ రాత్రి నుంచి ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను విధించనుంది.