చంద్రబాబుకు తీరని అవమానం-చంద్రగిరిలో కుటుంబ స్ధలం కబ్జా-రాష్ట్రంలో చర్చ
ఏపీలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన దిగ్గజ రాజకీయ నేత, సుదీర్ఘ కాలం విపక్ష నేతగా ఉన్న నేతకు సైతం కబ్జాల బాధ తప్పలేదు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబ భూమిని కొందరు కబ్జా చేశారు. దీంతో దాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డెక్కాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అధికారులు మాత్రం ఎప్పటిలాగే ఎవరి దస్త్రాలు వారు తెచ్చుకోండి, పరిశీలించి న్యాయం చేస్తాైమంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

చంద్రబాబుకు మరో అవమానం
రాష్ట్రంలో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో అవమానం తప్పలేదు. ఇప్పటికే తాను 8 సార్లు గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతీ స్ధానిక సంస్ధల ఎన్నికలో ఓటములతో అవమానాల పరంపర కొనసాగుతోంది.
దీనికి తోడు ఇప్పుడు అదే జిల్లాలో తన కుటుంబానికి ఉన్న స్ధలాల్ని సైతం కబ్జాలు చేయడం మొదలుపెట్టేశారు. చంద్రబాబుపై ప్రభుత్వ వైఖరిని గమనించిన కొందరు ఆయన పాత నియోజకవర్గం చంద్రగిరిలో ఉన్న ఆయన కుటుంబ భూమిని కబ్జా చేశారు. దీంతో దాన్ని విడిపించుకునేందుకు ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది.

చంద్రగిరిలో భూమి కబ్జా
చంద్రబాబు పాత నియోజకవర్గం చంద్రగిరిలోని శేషాపురంలో ఆయన తండ్రి నుంచి సోదరుడు రామ్మూర్తి నాయుడికి వారసత్వంగా వచ్చిన 87 సెంట్ల భూమిని కొందరు తాజాగా కబ్జా చేశారు. ఈ భూమిని నారా కృష్ణమనాయుడు నుంచి చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు 1989లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
దీన్ని తన కుమారులు చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడికి ఇచ్చారు. ఇలా తనకు వచ్చిన స్ధలాన్ని చంద్రబాబు స్ధానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీడీడీ కళ్యాణ మండపం కోసం ఉచితంగా ఇచ్చేశారు. కానీ రామ్మూర్తి నాయుడికి ఉన్న భూమిపై మాత్రం కొందరు కన్నేశారు. రెవెన్యూ రికార్డులు చూసుకోకపోవడంతో తన తండ్రికి స్ధలం అమ్మిన వారి కుటుంబమే దీనిపై కన్నేసింది. రాళ్లు జరిపేసి భూమిని స్వాధీనం చేసుకుంది.

తమదే అంటున్న ప్రత్యర్ధులు
అయితే నారా కృష్ణమనాయుడి నుంచి చంద్రబాబు తండ్రి ఖర్జూరాయుడు ఈ భూమిలో పూర్తి భాగం కొనుక్కోలేదని, కొంతభాగం తీసుకోగా.. మిగిలిన భాగంలోనే తాము రాళ్లు పాతామని, ఇది తమ భూమేనని ప్రస్తుతం దాన్ని కబ్జా చేసుకున్న రాజేంద్రనాయుడు చెప్తున్నారు. కొంతభాగమే తీసుకోవడం వల్ల ఆన్ లైన్ లో పేరు మారలేదని కూడా చెప్తున్నారు. ఇది కాస్తా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో రెవెన్యూ అధికారులు ఇరువర్గాల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని పరిశీలిస్తామని చెప్తున్నారు.

సొంతగడ్డపై వరుస ఎదురుదెబ్బలు
ఒకప్పుడు చంద్రగిరి, ఆ తర్వాత కుప్పం చంద్రబాబుకు పెట్టని కోటలు. ఇక్కడ రాజకీయాల్లోనే కాదు అన్ని వ్యవహారాల్లోనూ చంద్రబాబుదే పైచేయి. ఆయన కుటుంబానికి కూడా దీర్ఘకాలంగా ఇక్కడ ప్రభావం చూపుతారనే పేరుంది. దీంతో చంద్రబాబు కుప్పానికి సైతం వెళ్లకుండానే వరుసగా ఎన్నికలు నెగ్గుతూ వస్తున్నారు. అలాంటిది ఈ మధ్య కాలంలో కుప్పంలో మొదలైన ఎదురుదెబ్బలు ఇప్పుడు చంద్రగిరికీ పాకడంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లోకి జారుకుంటున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుతో పాటు టీడీపీ పరిస్ధితి కూడా దారుణంగా మారుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది












Click it and Unblock the Notifications