నెల్లూరు వైసీపీ వర్గపోరు-ఏప్రిల్ 17 సభపై తగ్గేదేలే అంటున్న అనిల్-అధిష్టానం అడ్డు చెప్పలేదంటూ
ఏపీలో తాజాగా సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ ప్రక్షాళన నెల్లూరు జిల్లా వైసీపీలో చిచ్చురేపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ రాజకీయాలు జిల్లాలో రచ్చకెక్కేలా ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నెల17న నెల్లూరు సిటీకి వస్తున్నారు. ఈ సందర్భంగా అనుచరులు భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు ఆయనకు పోటీగా మాజీ మంత్రి అనిల్ యాదవ్ కూడా కార్యకర్తలతో సభ పెడుతున్నారు. దీంతో రాజకీయం వేడెక్కింది.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సభ పెడుతున్న రోజే అనిల్ యాదవ్ సభ పెడుతుండటంపై వైసీపీ అధిష్టానం పెద్దలు అభ్యంతరం చెప్పారంటూ వచ్చిన వార్తల్ని అనిల్ ఖండించారు. వైసీపీ పెద్దలు సభ విరమించుకోమని తనకు చెప్పలేదన్నారు. అలాగే తాను పెడుతున్న సభ ఎవరికీ పోటీ కాదన్నారు. దీన్ని కొందరు వివాదంగా మారుస్తున్నారని అనిల్ తెలిపారు. ఈ సభ నిర్వహణ కోసం తాను మూడు రోజుల ముందుగానే దరఖాస్తు పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తాను జగన్ సైనికుడిగానే ఉంటాన్నారు.
ఏప్రిల్ 17న తన నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో సభ పెట్టడం ద్వారా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విసురుతున్న సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిల్ యాదవ్ చెప్పకనే చెప్తున్నారు. దీంతో ఆ రోజు ఏం జరగబోతోందన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే వీరిద్దరి పోరుతో జిల్లాలో వైసీపీ పోరు బజారున పడుతుందని అధిష్టానం పెద్దలు ఆందోళనలో ఉన్నారు. అలాగని రెడ్డి మంత్రి కోసం బీసీ నేత అయిన అనిల్ ను వారిస్తే ఆయన సామాజికవర్గంలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. దీంతో చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చని తెలుస్తోంది.