ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. రాజీనామాల సవాళ్లతో రచ్చ; మ్యాటరేంటంటే!!
ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టిడిపి అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వైసీపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల యుద్ధం కొనసాగుతోంది. స్థానికంగా రోడ్లు వెడల్పు చేసే విషయంలో మొదలైన ఘర్షణ ఇరువురి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
ఆళ్ళగడ్డలో రోడ్డు వెడల్పులో రచ్చ
రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఫోర్ రోడ్ సర్కిల్ దగ్గర రెండు రోజుల క్రితం బస్ షెల్టర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. భూమా నాగిరెడ్డి ప్రజలకోసం కట్టించిన బస్సు షెల్టర్ ను ఎలా తొలగిస్తారు అంటూ జగద్విఖ్యాత రెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భూమా జగద్విఖ్యాత రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారం పై సీరియస్ అయిన భూమా అఖిలప్రియ వైయస్సార్ సిపి నేతలు నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారని రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారు: భూమా అఖిలప్రియ
మాజీమంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ లో అవినీతి జరుగుతోందని, ఆళ్లగడ్డ లో జరుగుతున్న అవినీతిని తాను నిరూపించు లేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భూమా అఖిల ప్రియ. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు అని, కలెక్టర్ దగ్గరకు విచారణకు రావాలని డిమాండ్ చేశారు భూమా అఖిలప్రియ.
అవినీతిని నిరూపించ లేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్న మాజీ మంత్రి
తాను అవినీతిని నిరూపించ లేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని, అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము ఎమ్మెల్యేకి ఉందా అని ప్రశ్నించారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాతపూర్వకంగా కలెక్టర్ కు ఇస్తానని వెల్లడించారు. అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యం ఉంటే రాజీనామా పత్రం తీసుకుని కలెక్టర్ ముందుకు రావాలని భూమా అఖిలప్రియ సవాల్ చేశారు.
ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డిపై తీవ్ర స్థాయిలో అఖిలప్రియ ధ్వజం
ఇక ఇదే సమయంలో ఈ వ్యవహారం పై రెండు రోజుల్లో కలెక్టర్ ను కలిసి ధర్నా చేస్తామని భూమా అఖిలప్రియ వెల్లడించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భూమా అఖిలప్రియ ప్రభుత్వానికి తాము దానం చేసిన స్థలంలో కట్టిన స్టేడియానికి తన తండ్రి పేరు పెట్టుకున్నాం అని, కానీ ప్రజాధనంతో మున్సిపల్ స్థలంలో కట్టిన ఆఫీసుకి ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమా అఖిలప్రియ సవాల్ కు స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే భూమా అఖిల ప్రియ చేసిన సవాల్ కు స్పందించారు ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి. అవినీతి జరిగిందని ఆరోపణలను అఖిలప్రియ నిరూపిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ప్రజల ఆమోదంతోనే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, మురుగు కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బస్ షెల్టర్ కూల్చివేస్తామని చెప్పడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అఖిల ప్రియ సవాల్ కు ప్రతి సవాల్ .. తాను రెడీ అన్న బ్రిజేంద్రా రెడ్డి
ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తే నష్టపరిహారం ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ ప్రజలను తప్పుదారి పట్టించడానికి భూమా అఖిలప్రియ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై కలెక్టర్ దగ్గర విచారణకు వెళ్దామని చేసిన సవాలుకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు బ్రిజేంద్ర రెడ్డి. కలెక్టర్ తో విచారణ చేయించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని బ్రిజేంద్ర రెడ్డి కోరారు. మొత్తానికి ఆళ్లగడ్డ రాజకీయాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వైసిపి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో హాట్ హాట్ గా మారాయి.