హోం మినిస్టర్ అనితకు అహంకారం
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఇలాంటి అమానుష ఘటన జరగడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని, స్వయంగా సీఎం నియోజకవర్గంలోనూ ఇదే దుస్థితి నెలకొందని రోజా విమర్శించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తిమ్మరాయప్ప అనే వ్యక్తి ముని కన్నప్ప వద్ద రూ. 80 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో అతని భార్యను చెట్టుకు కట్టేసి వేధించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించలేదనే నెపంతో అందరూ చూస్తుండగానే మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు.

కర్రతో దాడి చేయడమే కాకుండా, మహిళ ముఖంపై ఉమ్మి, అసభ్యకరంగా ప్రవర్తించారని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా మహిళలకు మీరు ఇచ్చే గౌరవం అంటూ ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిగా ఒక మహిళ ఉండి కూడా ప్రయోజనం లేదని, కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం హోం మినిస్టర్ అనితకు లేదా అని ఆమె ప్రశ్నించారు. బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడటం హోం మంత్రి అహంకారానికి నిదర్శనం అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications