మాజీమంత్రి శంకర్ నారాయణకు గడప గడపకు నిరసనసెగ; వీడియో పోస్ట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడపగడపకు ప్రభుత్వం అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు నేరుగా వెళ్లాలని నిర్ణయించి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్ ఎంతో ప్లాన్డ్ గా ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రారంభించిన కార్యక్రమం అధికార పార్టీ నేతలకు తిప్పలు తెచ్చి పెట్టింది. ఐదేళ్లకొకసారి ఎన్నికల సమయంలోనే ఓటర్ల గడప తొక్కే ప్రభుత్వం తమది కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రభుత్వం తమదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ప్రజలకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతల తిప్పలు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు పెద్ద సమస్యగా మారింది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక నానా చావు చస్తున్నారు. తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వరుసగా నియోజకవర్గంలో ప్రజల నుండి నిరసనను ఎదుర్కొంటున్నారు. ఇదెక్కడి తిప్పలురా బాబు అన్నట్టుగా ఆయన గడపగడపకూ తిరుగుతున్నారు.
మాజీ మంత్రి శంకర్ నారాయణను నిలదీస్తున్న నియోజకవర్గ ప్రజలు
ఇటీవల పరిగి మండలంలో పర్యటించిన ఆయన ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలపై నిలదీయడంతో చెప్పేది వినాలి అంటూ చేతులెత్తి దండం పెట్టారు. మూడేళ్లు మంత్రిగా ఉన్న ఏం చేశారని మోద గ్రామ పంచాయతీలోని పుట్ట గొల్లపల్లి గ్రామస్తులు మాజీ మంత్రి శంకర్ నారాయణ ను నిలదీశారు. గ్రామంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని, తాగేందుకు నీళ్లు లేవని, పింఛన్లు ఇవ్వడం లేదని, రోడ్లు సరిగా లేవని మహిళలు సమస్యల చిట్టా మాజీ మంత్రి ముందు ఏకరువు పెట్టారు.

శంకర్ నారాయణ వీడియో పోస్ట్ చేసి టార్గెట్ చేస్తున్న టీడీపీ
దీంతో తెలుగుదేశం పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ కి ఎదురైన పరిస్థితిని వీడియో షేర్ చేసి మరీ శంకర్ నారాయణ ను టార్గెట్ చేసింది. ఆయన మంత్రిగా పనిచేసినా ప్రజల నుండి ఆయనకు వ్యతిరేఖత వ్యక్తం అవుతుందని ఆ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేసింది టీడీపీ. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణపై జనం తిరగబడ్డారు అంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రతీ ఊరులోనూ వైసిపి ఎమ్మెల్యే శంకర్ నారాయణను అడ్డుకున్నారు. భయపడిన వైసీపీ సర్పంచులు తమ గ్రామాల్లో గడప గడపకీ కార్యక్రమం రద్దు చేసుకున్నారు అంటూ టీడీపీ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తుంది.

గడప గడపకు వైసీపీ నేతల ఇబ్బందులు
ఇక సీఎం జగన్ ఎన్నికల వ్యూహంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో మళ్ళీ సామాజిక న్యాయభేరి అంటూ బస్సు యాత్ర ప్రారంభించారు జగన్. అయితే ఈ కార్యక్రమం ఆపితే ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని భావించి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కానీ వైసీపీ నేతలకు ప్రతీ ఊర్లో సమస్యలు స్వాగతం పలకటం ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేతలు సతమతమవుతున్నారు.












Click it and Unblock the Notifications