జగన్, షర్మిల ఒక్కటే ! ఆమెకు పీసీసీ ఇవ్వొద్దు-మాజీ ఎంపీ హర్షకుమార్ వినతి..
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు సీనియర్ల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. తెలంగాణలో వైఎస్సార్టీపీని పెట్టి అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి, తానూ చేరిన వైఎస్ షర్మిలకు ఏపీలో పీసీసీ ఛీఫ్ ఇచ్చేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఏపీసీసీ ఛీఫ్ గా వైఎస్ షర్మిలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. షర్మిలకు పీసీసీ ఛీఫ్ పదవి ఇవ్వొద్దని అధిష్టానానికి సూచించారు. జగన్, షర్మిల ఒక్కటేనని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్ గా ఉండేందుకే చెరో పార్టీ ఎంచుకున్నట్లు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పీసీసీ ఛీఫ్ బదులుగా జాతీయ స్ధాయి పదవి ఇవ్వాలన్నారు.

కేంద్రంలో మోడీ వెంట జగన్ వెళ్తున్నట్లే, సోనియా వెంట షర్మిల వెళ్తున్నారని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. అయినా తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిలకు ఏపీలో చోటెక్కడుందని ఆయన ప్రశ్నించారు. షర్మిలను పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హర్షకుమార్ తెలిపారు. దీంతో ఇప్పుడు హర్షకుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే షర్మిల పార్టీలో చేరి రెండువారాలు గడుస్తున్నా పీసీసీ ఛీఫ్ పదవిపై కానీ మరేదైనా జాతీయ స్ధాయి పదవి ఇచ్చే అంశంపై అధిష్టానంతో పాటు ఇతర నేతలు కూడా నోరు మెదపడం లేదు.












Click it and Unblock the Notifications