విశాఖ స్టీల్పై ప్రధానికి జగన్ లేఖ వేస్ట్- చంద్రబాబు, జగన్ ఆఫీసులకు ఫోన్లు- ఉండవల్లి వెల్లడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై వివిధ రాజకీయ పక్షాలు మండిపడుతుండగా.. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని పునఃసమక్షించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ లేఖతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు అఖిలపక్షం నిర్వహించేందుకు అన్ని పార్టీలను సంప్రదిస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణఫై ఉండవల్లి ఫైర్
విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లో ఉందన్న కారణంతో ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయం, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఉండవల్లి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గనులు కేటాయిస్తే సరిపోయే దానికి, ప్రైవేటీకరణ అంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని, దీనిపై త్వరలో భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ఉండవల్లి తెలిపారు.
ప్రధానికి జగన్ లేఖతో నో యూజ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖపై మాజీ ఎంపీ ఉండవల్లి పెదవి విరిచారు. ఈ లేఖతో ఎలా్ంటి ప్రయోజనం ఉండబోదన్నారు. దీన్ని తీసి పక్కనబెడతారని ఆయన తెలిపారు. గతంలోనూ ఇలాంటి లేఖలు ఎన్నో రాశారని, వాటిపై ఎలాంటి స్పందనా లేదన్నారు. ప్రైవేటీ కరణపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వైఖరి చూశాక తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. దీంతో జగన్ లేఖ రాయడంపై వైసీపీ నేతలు చేస్తున్న వాదనకు ఉండవల్లి గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లయింది.
అఖిలపక్ష భేటీకి జగన్, చంద్రబాబుకు ఫోన్ చేశా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు. ఇందుకోసం అఖిలపక్ష భేటీ నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు ఆఫీసులకు కూడా ఫోన్లు చేసినట్లు ఉండవల్లి వెల్లడించారు. అయితే అధికార, ప్రతిపక్షాల వైఖరి చూస్తుంటే ఇదంతా వృధా అనిపిస్తోందన్నారు. సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు వస్తామని చెప్పారన్నారు. అన్ని పార్టీలు కలిసి గనులు సాధించాలన్నది తన ప్రణాళిక అని ఉండవల్లి తెలిపారు.
Recommended Video
వైసీపీ ఎంపీలకు నచ్చని బడ్జెట్ జగన్కు బావుందా ?
సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో మరో అంశాన్ని కూడా ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీల స్పందనకూ, జగన్ స్పందనకూ పొంతన లేదన్నారు. ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలపైనా ఉండవల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలంతా కేంద్ర బడ్జెట్ బాగోలేదని చెబితే, జగన్ మాత్రం బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం జగన్ బడ్జెట్ను అభినందించడం ఏంటో తెలియడం లేదన్నారు.