అద్దె బాకీ వివాదంలో జస్టిస్ కనగరాజ్- హైకోర్టు తీర్పుతో చెన్నైకు జంప్- సంబంధం లేదన్న ఈసీ..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానంలో వైసీపీ ప్రభుత్వం హడావిడిగా నియమించిన జస్టిస్ కనగరాజ్ హైకోర్టు తన నియామకం కొట్టేసిన తర్వాత తిరిగి చెన్నై వెళ్లిపోయారు. అంతవరకూ బాగానే ఉన్నా విజయవాడలో ఆయన తీసుకున్న ఫ్లాట్కు అద్దె మాత్రం కట్టలేదు. అందులో ఈసీ సమకూర్చిన ఫర్నిచర్ కూడా అలాగే ఉండిపోయింది. దీంతో ఈసీ అదికారులు నిన్న బలవంతంగా దాన్ని తీసుకెళ్లారు. అంతే కాదు కనగరాజ్ అద్దెతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ వివరణ కూడా ఇంటి యజమానికి రాసిచ్చారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.

కనగరాజ్ ఫ్లాట్ వివాదం..
ఏపీలో నిమ్మగడ్డ రమేష్ స్ధానంలో ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో అంబులెన్స్లో చెన్నై నుంచి విజయవాడ చేరుకున్న జస్టిస్ కనగరాజ్.. నగరంలో ఉండేందుకు ఓ ఫ్లాట్ తీసుకున్నారు. అప్పట్లో ఈసీ అధికారులు ఈ ఫ్లాట్లో ఫర్నిచర్ కూడా సమకూర్చారు. ఏప్రిల్, మే నెలల్లో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత జూన్లో ఆయన నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన జూన్ లోనే విజయవాడలో ఇల్లు వదిలిపెట్టి చెన్నై వెళ్లిపోయారు. కానీ అందులో ఫర్నిచర్ మాత్రం అలాగే ఉండిపోయింది. అటు అద్దె కట్టక, ఇటు ఫర్నిచర్ తీసుకెళ్లక కాలం గడిపేస్తుంటే ఫ్లాట్ యజమానికి చిర్రెత్తుకొచ్చింది. అక్కడే అసలు కథ మొదలైంది.

అద్దె కట్టాకే ఫర్నిచర్ తీసుకెళ్లమన్న ఓనర్..
ఈసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఫర్నిచర్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ బకాయి ఉన్న అద్దెను చెల్లించాకే ఫర్నిచర్ తీసుకెళ్లాలని ఫ్లాట్ యజమాని అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించారు. ఏప్రిల్ నుంచి జూలై వరకూ కనగరాజ్కు జీత భత్యాలను చెల్లించామన్నారు. ఆయన చెల్లించకపోతే తమకేం సంబంధం అన్నారు. కాసేపు ఉద్రిక్తత తర్వాత అద్దె చెల్లించకపోతే అదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఫ్లాట్ యజమాని కోరాడు. దీనికి ఒప్పుకుని చివరికి పత్రం రాసిచ్చి ఫర్నిచర్ తీసుకుని ఈసీ అధికారులు బయటపడ్డారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు.
Recommended Video

ఇరుకునపడ్డ వైసీపీ సర్కార్...
నిమ్మగడ్డ రమేష్ స్ధానంలో తాము ఏరికోరి తెచ్చుకున్న జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టేయడంతో వైసీపీ ప్రభుత్వానికి నిరాశ తప్పలేదు. అంతటితో ఆగకుండా ఇప్పుడు కనగరాజ్ అద్దె కూడా చెల్లించకుండా చెన్నై వెళ్లిపోవడంతో మరో వివాదం నెలకొంది. ఈ వివాదానికి సైతం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జూన్, జూలై నెల జీత భత్యాలను ఆయనకు చెల్లించకూడదు. లేదా రికవరీ చేయాలి. ముందుగా చెల్లింపులు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయన్నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపపరి నిర్ణయం తీసుకుంటామని ఈసీ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications