చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్
విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసి.. ఆ తర్వాత వారిని మోసం చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీసులు మీడియాకు తెలిపారు. గౌతమ్కు తిరుపతి సమీపాన రామచంద్రపురంలోని టీడీపీ క్రియాశీల సభ్యుడు ఎల్లంటి భక్తవత్సల నాయుడు కుమార్తె ఎల్లంటి లోచినితో 2013లో వివాహమైంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గౌతమ్ తన తాతతో కలిసి సచివాలయానికి తరచూ వెళ్తూ అధికారులతో పరిచయం పెంచుకున్నాడు.
తన భార్య మధ్యప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందిన అధికారి అని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు బాగా సన్నిహితమని చెప్పుకునేవాడు. అంతేగాక, అందుకు సంబంధించిన ఫొటోలు చూపుతూ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించడం గమనార్హం.
అమ్మ మ్యాన్పవర్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా నిరుద్యోగుల నుంచి రూ. 5 కోట్లు మేర వసూలు చేసి.. తప్పుడు నియామక పత్రాలు కూడా అందించాడు. అయితే, వాటితో వారికి ఉద్యోగాలు రాకపోవడంతో.. నిరుద్యోగులు విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితుడైన గౌతమ్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా.. వారికి రిమాండ్ విధించారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ మోసపోయిన నిరుద్యోగులు కోరుతున్నారు.
టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. టీటీడీలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నలుగురు సభ్యుల బృందం నిరుద్యోగల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. సుమారు వంద మంది నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు లక్ష రూపాయలకు వరకూ వసూలు చేసి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.