ఏపీలో కాంగ్రెస్ పొత్తులు ఇలా.. ఆ ఇద్దరికే సీఎం పదవి- చింతా మోహన్ కామెంట్స్..
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం ఇప్పుడు ఏపీలో సైతం ఆ పార్టీ నేతలకు ఆశలు పుట్టిస్తోంది. గతంలో ఏపీ ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని.. 2014 నుంచి ఇక్కడి ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం మొదలుపెట్టారు. వచ్చే ఏడాదికి కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించి పదేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రజల్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందనే దానిపై చర్చ మొదలైంది. దీనికి సమాధానంగా మాజీ కేంద్రమంత్రి, తిరుపతి మాజీ ఎంపీ కూడా అయిన సీనియర్ నేత చింతా మోహన్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో పాటు సీఎం పదవి షేరింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లబోతోందా అన్న చర్చ సాగుతోంది.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాన్ని ఇవాళ మాజీ ఎంపీ చింతామోహన్ బయటపెట్టారు. ఏపీలో ఏ పార్టీతోనూ కాంగ్రెస్ కు పొత్తులుండవని చింతా మోహన్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
2024లో ఏపీలో కాంగ్రెస్ దే అధికారం అని చింతా మోహన్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే తొలి రెండున్నరేళ్లు ఎస్సీలకు, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాపులకు సీఎం పదవి ఇస్తామంటూ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు, కాపులు బలమైన మద్దతుదారులుగా ఉండేవారు. అయితే ఎస్సీలకు సీఎం పదవి ఇచ్చినా కాపులకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇవ్వలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితుల్లో కాపులకు సీఎం పదవి డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ తాను సీఎం పదవిపై డిమాండ్లు చేయదల్చుకోలేదంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలతో వారిలో మథనం మొదలైంది. ఈ నేపథ్యంలో చింతా మోహన్ కాపులకు సీఎం పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications