నిమ్మగడ్డకు సాయంగా తెలంగాణ మాజీ ఎస్ఈసీ- సలహాదారుగా నాగిరెడ్డి ఎంట్రీ
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నాలుగో దశ జరుగుతోంది. రేపటితో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసలే అరకొర సిబ్బందితో పనిచేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై ఇవన్నీ ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన నిర్ణయించారు.
ఏపీ స్ధానిక సంస్దల ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సలహాలు ఇచ్చేందుకు తెలంగాణ మాజీ ఎస్ఈసీ వి.నాగిరెడ్డి సిద్ధమయ్యారు. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కోరిక మేరకు సేవలందించేందుకు ఆయన ఇవాళ విజయవాడ వచ్చారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డతో నాగిరెడ్డి సమావేశమయ్యారు. స్ధానిక ఎన్నికల్లో తాజా పరిస్ధితిని, ఇతర వివరాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈసీ సలహాదారు హోదాలో ఇకపై నాగిరెడ్డి కూడా కీలక సమావేశాలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

నాగిరెడ్డితో జరిగిన సమావేశంలో ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధత, ఫిర్యాదులు, హైకోర్టులో కేసులు, కోర్టు ఆదేశాలు వంటి వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే విషయంలో వీరిద్దరూ కలిసి చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డకు సాయంతో అదనపు డీజీ సంజయ్తో పాటు ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కన్నబాబు సహకారం అందిస్తున్నారు. నాగిరెడ్డి రాకతో ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు లేక కేవలం సలహాలకే పరిమితం చేస్తారా చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications